ప్రకటించిన సాయానికి డిమాండా ? దొరికిపోయిన పవన్- అయిపోయిన పెళ్లికి బాజాలేంటన్న వెల్లంపల్లి....
ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. దాన్ని బహిరంగంగానే ప్రకటించింది. ఈ విషయం తెలియక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రోజు అదే డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ నేతలు జనసేనానిని ఆడుకోవడం మొదలుపెట్టేశారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక జనసేన అంతర్మథనంలో ఉంది.

అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ లకు సాయం...
ఏపీలో అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ లకు ఒక విడత సాయంగా ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో గుళ్లు, మసీదులు, చర్చిలు తెరుచుకోకపోవడంతో వీటిపైనే ఆధారపడిన వీరికి సాయం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని సర్కారు ఈ నెల 19వ తేదీన మీడియాకు వెల్లడించింది. వీరి ద్వారా లబ్దిదారులకు కూడా ఈ విషయం తెలిసింది.

తెలియక పవన్ డిమాండ్...
ఏపీ ప్రభుత్వ నిర్ణయం తెలియని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అర్చకులను ఆదుకోవాలంటూ నిన్న ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా సంక్షోభం కారణంగా అర్చకులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి సాయం అందించాలని పవన్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఆశ్చర్య పోవటం ప్రభుత్వ పెద్దల వంతయింది. సాయంపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చాక కూడా పవన్ డిమాండ్ చేయడంతో సమాచారం అందరికీ చేరిందో లేదో తెలుసుకునేందుకు మంత్రులు ప్రయత్నించారు. చివరికి పవన్ కు సమాచారం వెళ్లలేదనే నిర్ధారణకు వచ్చారు.
Recommended Video

మంత్రి వెల్లంపల్లి ఫైర్....
ప్రభుత్వం ఓసారి సాయం ప్రకటించిన తర్వాత పవన్ డిమాండ్లు చేయడంలో అర్ధం లేదన్నారు మంత్రి వెల్లంపల్లి. పవన్ వైఖరి చూస్తుంటే అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టినట్లుందని, లక్షల పుస్తకాలు చదివి పవన్ కు ఉన్నమతి పోయినట్లుందని మంత్రి ఎద్దేవా చేశారు. పురోహితులపై పవన్ కపట ప్రేమ చూపుతున్నారని, హైదరాబాద్ లో కూర్చున్న పవన్ కళ్యాణ్ కళ్లకు ఏపీలో సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. విజయవాడ వస్తే వాస్తవాలు కనపడతాయన్నారు. ప్రభుత్వం మే 19న సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకటించిందని, దీని ప్రకారం 26న అర్చకులకు ఐదువేలు ఇస్తామని చెప్పినట్లు మంత్రి గుర్తుచేశారు. ఇవేపీ పట్టించుకోకుండా రాజకీయ మనుగడ కోసం ప్రకటనలు చేయడం పవన్ కే చెల్లిందని వెల్లంపల్లి విమర్శించారు.












Click it and Unblock the Notifications