సత్యంబాబు విషయంలో కానిస్టేబుల్ కుట్ర..! అయ్యో పాపం అనిపించే నిజాలు..!!
విజయవాడ : ఆయేషా మీరా కేసులో విచారణను కేంద్ర విచారణ సంస్థ వేగవంతం చేసింది. అందులో బాగంగా పాత నేరస్తులుగా ముద్రించబడ్డ కొంత మందిని విచారించింది సీబీఐ. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఆయేషా హత్యకేసులో అసలు వాస్తవాలు మాత్రం ఇంతవరకూ వెలుగుచూడలేదు. కాని అదే కేసులో ప్రధాన ముద్దాయి అంటూ సత్యం బాబు అనే యువకుడికి శిక్షించిన విషయం తెలిసిందే..! కొన్నాళ్ల తర్వాత సత్యంబాబు నిర్దోషి అంటూ కోర్టు తేల్చడంతో జైలునుండి విడుదలయ్యాడు. తాజాగా సీబీఐ విచారణలో సత్యంబాబు దిమ్మతిరిగే వాస్తవాలను బయట పెట్టాడు. సామాన్యులను రక్షించాల్సిన పోలీసులే ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తారో బహిర్గతం చేసాడు సత్యం బాబు.
సీబీఐ ముందు సత్యంబాబు చెప్పిన వాస్తవాలు..! ఔరా అనిపిస్తున్న కానిస్టేబుల్ దుశ్చర్య..!!
ఓ కానిస్తేబుల్ కుట్ర సత్యంబాబు కుటుంబసభ్యులను జీవితకాల వ్యధకు గురిచేసింది. నిండు జీవితాన్ని కోర్టులు-కేసుల మయం చేసింది. అభం శుభం తెలియని టీనేజ్ వయసులో ఆరుబయటకు వచ్చి ఆ కానిస్టేబుల్ చూపులకు చిక్కడమే సత్యంబాబు చేసిన తప్పా అని సభ్యసమాజం ఆలోచించాల్సి వస్తోంది. ఆయేషా మీరాను హత్య చేసింది ఎవరు..? చేయించింది ఎవరు అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ఆ కేసులో సత్యం బాబు పావుగా మార్చే పరిణామాలు మాత్రం కంటతడిపెట్టిస్తుంటాయి. సీబిఐ విచారణలో సత్యంబాబు వెళ్లడించిన విషయాలు పాషాణ హ్రుదయాలను సైతం కరిగించక మానదు. అయ్యో పాపం అనే భావన తెప్పించక మానదు. ఆ రోజు ఏంజరిగిందో సత్యం బాబు మాటల్లోనే తెలుసుకుందాం..!!
చెప్పులు తీసుకుని కేసులో ఇరికించారన్న సత్యంబాబు..! ఇదే ఆ కానిస్టేబుల్ కుట్ర..!!
అయేషా మీరా కేసులో నందిగామలో అప్పట్లో పనిచేసిన కానిస్టేబుల్ లక్ష్మణ్ స్వామి నన్ను ఇరికించారని సత్యం బాబు సీబీఐ అధికారులకు విన్నవించాడు. నేను పనికి వెళ్లి వస్తున్న సమయంలో నందిగామ గాంధీ సెంటర్లో ఆపి, నా దగ్గర ఉన్న పాత చెప్పులు బలవంతంగా తీసుకున్నారన్నారు. నాకు 100 నోటు ఇచ్చి కోత్త చెప్పులు కోనుకోమన్నారు. నాకెందుకు కొత్త చెప్పులు, ఇచ్చిన డబ్బులు వద్దనగా నన్ను తీవ్రంగా కొట్టాడన్నారు. మరుసటి రోజు నా చెప్పులనే ఆయేషా హత్య జరిగిన ప్రదేశం లో వేసి, అదే రోజు అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి నన్ను అరెస్టు చేశారని తెలిపాడు.
వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..! విచారణ వేగం పెంచిన సీబీఐ..!!
కానిస్టేబుల్ లక్ష్మణ్ స్వామి నన్ను హాస్టల్ వద్ద తిరుగుతున్నావని బెదిరించాడు. మేము చెప్పినట్లు వినకపోతే మీ తల్లి, సోదరిని ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారని తెలిపాడు. పోలీస్ సిబ్బంది తమ ప్రమోషన్ల కోసం నన్ను ఈ కేసులో ఇరికించి నా జీవితాన్ని బలి చేశారని ఆవేదనతో చెప్పాడు. సత్యం బాబు చెప్పిన విషయాలను విషయాలను సీబీఐ అధికారుల బృందం నోట్ చేసుకుంది. సుమారు ఐదు గంటల పాటు విచారించి ముగించారు. ఇదిలా ఉండగా సత్యం బాబును మళ్లీ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఇంటికి భారీగా గ్రామస్థులు చేరుకున్నారు.
కోనేరు సతీష్ ను సుధీర్గంగా విచారించిన సీబిఐ..! పాస్ పోర్ట్, విదేశీ పర్యటనలపై ఆరా..!!
ఇక అయేషా మీరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కోనేరు సతీష్ పాత్రపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ బృందం తొలి రోజు 14 గంటలపాటు కోనేరు సతీష్ ను విచారించింది. శనివారం సతీష్ కు చెందిన మూడు బ్యాంక్ లాకర్లను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. లాకర్ల లో గుర్తించిన విషయాలతో పాటు కోనేరు సతీష్ పాస్ పోర్టును కూడా పరిశీలిస్తారు. అయేషా హత్య తర్వాత కోనేరు సతీష్ ఎక్కడెక్కడ ఉన్నాడనే అంశాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో సీబీఐ ఈ కేసు విచారణను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది.