విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో కరోనా కలకలం: సిబ్బందికి కరోనా, డైలమాలో కౌన్సిల్ సమావేశం
మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదే సమయంలో తాజాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కరోనా కలకలం రేగింది. ఇప్పటికే పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోని టౌన్ ప్లానింగ్, రెవిన్యూ, ఇంజనీరింగ్ విభాగంలో, పలువురు సిబ్బంది ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. అధికారులు మాత్రమే కాకుండా కార్పొరేటర్లు సైతం కరోనా బారిన పడుతుండటం కనిపిస్తుంది.
ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత మొదటిసారి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా, ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లకు కోవిడ్ పాజిటివ్ రావడంతో కౌన్సిల్ సమావేశం నిర్వహించాలా వద్దా అన్న చర్చ జరుగుతోంది. అయితే ముందస్తుగా కార్పొరేటర్లందరికీ కరోనాపరీక్షలు చేస్తున్న అధికారులు, కొవిడ్ పరీక్షల అనంతరం రిజల్ట్స్ తర్వాత కరోనా ప్రభావం ఏవిధంగా ఉందనేది అంచనా వేసి, కౌన్సిల్ సమావేశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం.
ఒకపక్క అధికారులు వరుసగా కరోనా బారిన పడటం , మరోపక్క కార్పొరేటర్ లకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావటం కాస్త ఆందోళన కలిగిస్తున్న అంశం . ఈ సమయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించటంపై సందిగ్ధత నెలకొంది.ఇక ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. నిన్న ఒక్క రోజే 5 వేలకు పైగా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31,710 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారిక డేటా చెప్తుంది . ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ మరీ ప్రమాదకరంగా ఉందని , అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది .