కరోనా ఎఫెక్ట్ : కృష్ణాజిల్లా గ్రామాల షాకింగ్ డెసిషన్.. అక్కడికెళితే అంతే సంగతులు...
దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ మహమ్మారిని అణచివేసేందుకు కేంద్రం ప్రకటించిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటికే కరోనా ప్రభావిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించిన కృష్ణాజిల్లాలోని గ్రామాల్లో ఇతరులను రానీయకుండా స్ధానికులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున తమ గ్రామాల్లోకి ఇతరులెవరూ రావొద్దని వారు కోరుతున్నారు.

విజయవాడలో కరోనా కేసుతో...
కృష్ణాజిల్లా విజయవాడలో తాజాగా ఓ కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసింది. పారిస్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ విద్యార్ధి అక్కడి నుంచి విజయవాడకు నేరుగా రావడంతో అతనికి కరోనా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్దారణ అయింది. విజయవాడ కొత్తపేటకు చెందిన ఇతడిని అధికారులు ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మిగిలిన ప్రాంతాలు, గ్రామాలు అప్రమత్తమవుతున్నాయి. నిత్యం విజయవాడకు వెళ్లి తమ గ్రామాల్లోకి వచ్చే వారిని ఎవరినీ అనుమతించరాదని తాజాగా రెండు గ్రామాలు నిర్ణయించాయి.

మా గ్రామాల్లోకి రావొద్దు...
కరోనా మహమ్మారిని జిల్లా నుంచి తరిమేసేందుకు ఏకమవుతున్న కృష్ణా జిల్లాలోని అంబాపురం, నైనవరం గ్రామాల ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామాల్లోకి బయటి వ్యక్తులను ఎవరినీ అనుమతించరాదని నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ పొరుగునే ఉన్న అంబాపురానికి వస్తున్న బయటి వ్యక్తులను స్ధానికులు అడ్డుకుంటున్నారు.
రోడ్లకు అడ్డంగా బైక్ లు నిలిపి మరీ బయటి వారిని తమ గ్రామాల్లోకి రాకుండా యువకులు అడ్డుకుంంటున్నారు.

గ్రామస్ధులతో వాగ్వాదం..
హైదరాబాద్ నుంచి అంబాపురం, నైనవరం మీదుగా కృష్ణాజిల్లాలోని ఇతర గ్రామాలకు వెళ్లే వారిని స్ధానికులు అడ్డుకుంటుండంతో అక్కడ తీవ్ర వాగ్వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినా స్ధానిక యువకులు వెనక్కి తగ్గడం లేదు. ఈ సందర్భంగా తమ గ్రామాలకు కరోనా వైరస్ అంటించొద్దంటూ బయటి వారిని వారు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఎలాగో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ విధించింది కాబట్టి ప్రభుత్వానికి సహకరించండంటూ గ్రామాల్లోని యువత ప్లకార్డులు చేతబూని అర్ధిస్తున్నారు. దీంతో అంబాపురం, నైనవరం వచ్చేవారంతా చేసేది లేక వెనుదిరుగుతున్నారు.












Click it and Unblock the Notifications