చంద్రబాబు, నారాయణ క్వాష్ పిటిషన్ల విచారణ-వాడీవేడీగా వాదనలు-సాయంత్రం తీర్పు
ఏపీ రాజధాని అమరావతిలో దళితుల భూముల విషయంలో జారీ చేసిన జీవో 41కు వ్యతిరేకంగా ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసును సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన మాజీ కేబినెట్ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో వాడీవేడీగా వాదనలు సాగుతున్నాయి. ఉదయం ప్రభుత్వ వాదనలు ఆలకించిన హైకోర్టు.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రభుత్వ వాదనలు వినబోతోంది. అనంతరం సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశముంది.

చంద్రబాబు, నారాయణ పిటిషన్లపై విచారణ
ఏపీ హైకోర్టులో చంద్రబాబు, నారాయణ పిటిషన్లపై వాదనల సందర్భంగా ముందుగా పిటిషనర్ల వాదనలను ధర్మాసనం తీసుకుంది. ఇందులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ క్రిమినల్ లాయర్ సిద్ధార్ధ్ లూత్రా వాదించగా.. నారాయణ తరఫున ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. ఇద్దరూ దాదాపు అవే వాదనలు వినిపించారు. సీఐడీ తమ పిటిషనర్లపై పెట్టిన కేసులకు ఆయా సెక్షన్లు వర్తించవని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తులకు ఆపాదించడం సరికాదని వీరు వాదించారు.

చంద్రబాబు లాయర్ వాదన
ముందుగా వాదించిన చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూత్రా జీవో నంబర్ 41ను ఇంతవరకూ ప్రభుత్వం ఛాలెంజ్ చేయలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు క్వాష్ చేసిందని, ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసమే జీవో 41 ఇచ్చారని, ఇది జారీ చేసిన 35 రోజులకు సీఎం ఆమోదం కోసం పంపారని తెలిపారు. కానీ ప్రస్తుతం సీఐడీ దాఖలు చేసిన కేసులో పెట్టిన సెక్షన్లు దీనికి వర్తించవన్నారు. అదీ గాక కేసు దాఖలు చేసిన ఎమ్మెల్యే ఆర్కే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని తెలిపారు ప్రభుత్వమే భూములు తీసుకుంది కాబట్టి ఆ సెక్షన్లు వర్తించవని లాయర్ లూత్రా హైకోర్టు దృష్టికి తెచ్చారు. చంద్రబాబుపై దాఖలైన కేసు రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కేసు మాత్రమేన్నారు.

నారాయణ లాయర్ వాదన ఇదీ
చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూత్రా వాదనల తర్వాత మాజీ మంత్రి నారాయణ తరఫున మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. 2016 ఫిబ్రవరి 17న జీవో 41 ఇచ్చిన తర్వాత మాత్రమే చంద్రబాబు ఆమోదం కోసం ప్రభుత్వం పంపినట్లు ఆయన హైకోర్టు దృష్టికి తెచ్చారు. అప్పటివరకూ చంద్రబాబుకు ఆ విషయం తెలియదన్నారు. ఎమ్మెల్యే ఆర్కే సీఐఢీకి ఇచ్చిన ఫిర్యాదులో ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములు ఎక్కడ బలవంతంగా లాక్కున్నారో తెలపలేదని దమ్మాలపాటి హైకోర్టుకు తెలిపారు. కాబట్టి తన క్లయింట్ నారాయణపై దాఖలైన ఎఫ్ఐఅర్ రద్దు చేయాలని ఆయన హైకోర్టును కోరారు.

మధ్యాహ్నం ప్రభుత్వ వాదనలు
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు సీఐడీ కేసులు పెట్టించిన ప్రభుత్వం ఈ కేసులో తన తరఫు వాదనలను మధ్యాహ్నం వినిపించబోతోంది. ప్రభుత్వ వాదనలు కూడా విన్నాక సాయంత్రం హైకోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించబోతోంది. ప్రభుత్వం చేస్తున్న వాదన ప్రకారం ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గాలకు చెందకపోయినా వారికి అన్యాయం జరిగనప్పుడు స్ధానిక ప్రజాప్రతినిధిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేయడంలో తప్పులేదని చెబుతోంది. ఇదే వాదన హైకోర్టుకూ చెప్పబోతోంది.












Click it and Unblock the Notifications