సీఎం జగన్కు నోటీసులు ఇవ్వండి.. వంగలపూడి అనిత ఫైర్
విజయవాడ ఆస్పత్రిలో లైంగికదాడి పెను దుమారం రేపింది. అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్కి దారితీసింది. ఇరు పార్టీ నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. తనను బెదిరించారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. దాంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి నోటీసులు కూడా వచ్చాయి. దీంతో ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ పుట్టించాయి.
చంద్రబాబుకు మహిళా కమిషన్ నుంచి నోటీసులు జారీ అయిన విషయంపై టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల భద్రత విషయంలో విఫలమైన సీఎం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఫెయిల్యూర్ సీఎంకు నోటీసులు ఇవ్వాలని వాసిరెడ్డి పద్మకు సూచించారు.
వైసీపీ ప్రభుత్వంలో 1,500 లైంగికదాడులు జరిగాయని అనిత చెప్పారు. ఏప్రిల్ నెలలో 12 ఘటనలు జరిగాయని గుర్తుచేశారు. మహిళను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఫైరయ్యారు. మహిళలపై దాడుల్లో ఏపీ దేశంలోనే ఐదో స్థానంలో ఉందని ఆమె గుర్తుచేశారు. మహిళల అక్రమ రవాణాలో రెండో స్థానంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు తమకు నీతులు చెబుతారా అని మండిపడ్డారు.
తమ పాలనలో మహిళల భద్రతకు ప్రయారిటీ ఇచ్చామని.. ఈ స్థాయిలో నేరాలు కూడా జరగలేదని చెప్పారు. కానీ వైసీపీ హయాంలో అడ్డు అదుపూ లేకుండా జరుగుతున్నాయని చెప్పారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. ఎందుకిలా జరుగుతున్నాయని ఆమె ప్రశ్నించారు. పైకి చెప్పడం ఒకలా... లోన జరుగుతుంది మరోలా అని విరుచుకుపడ్డారు.