ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ-4న పరిషత్ నోటిఫికేషన్ ?
ఏపీలో కొత్త ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్నీ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ కావడంతో నీలం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆమె ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గవర్నర్ను కలిశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీకి ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబుతో పాటు ఇతర సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడిన నీలం... తనకు ఈ అవకాశం ఇచ్చిన గవర్నర్ హరిచందన్కు కృతజ్ఞతలు తెలిపారు. స్ధానిక సంస్ధల ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఎస్ఈసీ నీలం సాహ్నీ పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో ఎన్నికలను నిర్వహిస్తానన్నారు.
ఎస్ఈసీగా ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ ఐదేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచే ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నీలం సాహ్నీ అంతకుముందు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం సీఎం జగన్ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. ఇప్పుడు ఎస్ఈసీగా ఎంపిక కావడంతో ఆ పదవిని వదులుకున్నారు. ఆమె ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న పరిషత్, మున్సిపల్ ఎన్నికలతో పాటు సహకార ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఇందులో ముందుగా పరిషత్ ఎన్నికలకు ఈ నెల 4న నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలుస్తోంది.