ప్రకాశం బ్యారేజ్ వద్ద టీచర్ల ఆందోళన ఉద్రిక్తం- అరెస్టులపై చంద్రబాబు ఫైర్
టీచర్ల బదిలీల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అధ్యాపకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బదిలీలను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై టీచర్లు మండిపడుతున్నారు. ఇవాళ విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద టీచర్లు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది.
బదిలీల కౌన్సిలింగ్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రకాశం బ్యారేజ్ వద్ద నిరసనగా వెళ్తున్న టీచర్లను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని వారికి తెలిపారు. అయినా టీచర్లు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకీ తీసుకున్నారు. దీంతో పరస్ధితి ఉద్రిక్తంగా మారింది. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకోవడమేంటని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద టీచర్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ నాలుగు గోడల మధ్యే ఉపాధ్యాయులను రోడ్డెక్కించిన చరిత్ర జగన్మోహన్రెడ్డిదని చంద్రబాబు విమర్శించారు. బదిలీల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చేయడానికి గతంలో తాను కౌన్సిలింగ్ విధానం తీసుకొస్తే ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ పేరుతో ఉపాధ్యాయులు ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
ఉపాధ్యాయుల డిమాండ్లు తీర్చకుండా కక్షసాధింపు చర్యలకు దిగడం దారుణమన్నారు. టీచర్ల బదిలీల్లో వైసీపీ నేతల జోక్యమేంటన్నారు. ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పి అరెస్ట్ చేసిన ఉపాధ్యాయులను విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.