జనసేనకు మరో నేత గుడ్ బై ... పవన్ కు షాక్ ఇచ్చి బీజేపీలో చేరిక
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకపక్క జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే మరొక పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడిపోతున్నారు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీలో ఇప్పటికే కీలకంగా ఉన్న రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణ, చింతలపూడి వెంకట్రామయ్య, పార్ధసారధి వంటి కీలక నేతలు జనసేనకు రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా మరో నేత జనసేన కు గుడ్ బై చెప్పి బిజెపికి జై కొట్టారు .
తాజాగా గత ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి పోటీ చేసిన ధరణికోట వెంకటరమణ జనసేన పార్టీకి రాజీనామా చేసి బిజెపి బాట పట్టారు. వెంకటరమణ సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. జగ్గయ్యపేట టికెట్ దక్కించుకున్న ఆయన జగ్గయ్యపేటలో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలో జరుగుతున్న బీజేపీ గాంధీ సంకల్పయాత్రలో పాల్గొన్న బీజేపీ నేతల్ని కలిశారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడు కన్నా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అంతేకాదు ఆయనతో పాటు ఆయన అనుచరులు, సన్నిహితులు మరికొంత మంది కూడా బీజేపీలో చేరారు.

ఒక పక్క పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చెయ్యటానికి పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఏపీలో అధికార పార్టీ వైఖరిపై కూడా నిప్పులు చెరుగుతున్నారు. ఇక అలాగే తాజాగా పార్టీ నుండి నేతలు వెళ్ళిపోవటంపై కూడా స్పందించిన ఆయన పార్టీలో చెత్త పోతే కొత్త నీరు వస్తుందని పేర్కొన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పార్టీని నేతలు వీడి వెళ్తుండటం జనసేనకు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మైనస్ గా మారే ప్రమాదం ఉంది.












Click it and Unblock the Notifications