కొంపముంచిన రమేశ్ ఆస్పత్రి నిర్లక్ష్యం.. కరోనా లేకున్నా వైద్యం చేసి దోచారు, తుది నివేదికలో కమిటీ..
స్వర్ణప్యాలెస్ దుర్ఘటనకు సంబంధించి కమిటీ ఇచ్చిన తుది నివేదికలో విస్తుగోలిపే అంశాలు వెలుగుచూశాయి. అడుగడుగున్నా రమేశ్ ఆస్పత్రి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ.. కోవిడ్ మార్గదర్శకాలను పాటించకుండా.. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పనిచేసిందని.. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని నివేదికలో కమిటీ వివరించింది.
నిబంధనలకు తూట్లు..
స్వర్ణ ప్యాలెస్ ఘటనకు సంబంధించి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. స్వర్ణ ప్యాలెస్ హోటల్ యాజమాన్యంతో రమేశ్ ఆస్పత్రి చేసుకున్న అగ్రిమెంట్ గురించి పలు అంశాలను ప్రస్తావించింది. అగ్రిప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించకుండానే ఒప్పందం చేసుకున్నారని తెలిపింది. కోవిడ్ చికిత్సకు సంబంధించి ప్రోటోకాల్ పూర్తిగా ఉల్లంఘించారని.. ప్రభుత్వ మార్గదర్శకాలను పెడచెవిన పెట్టినట్టు స్పష్టంచేసింది.
డబ్బుల సంపాదించడమే ధ్యేయంగా..
కరోనా వైరస్ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన నియమాలను కూడా తుంగలో తొక్కిందని పేర్కొన్నది. వీటిపై పూర్తి అవగాహన ఉన్నా.. డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం ఒప్పందం చేసుకొని వ్యవహరించిందని తెలిపింది. కరోనా వైరస్ చికిత్స అవసరం లేకున్నా విలువైన రెమీడిసీవర్ను ఆస్పత్రిలో చేరిన వారికి అందజేసిందని తెలిపింది. విజయవాడలో ఎం-5, మెట్రోపాలిటన్ హోటళ్లలో అనుమతి లేకుండా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసిందని కమిటీ గుర్తించింది. అంతేకాదు స్వర్ణ ప్యాలెస్ హోటల్ యాజమాన్యంతో ఒప్పందం జరగకముందే కరోనా చికిత్స పేరుతో రోగులను ఆస్పత్రిలో ఉంచిందని తెలిపింది.
నో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, చెల్లించని పన్ను..
అగ్నిప్రమాదాలు నివారించే పరికాలు, ఎన్ వో సీ తీసుకోలేదని గుర్తుచేసింది. ప్రమాదం నివారించే వ్యవస్థ హోటల్లో లేనేలేదని తేల్చిచెప్పింది. నగరంలో రద్దీ ప్రాంతంలో ఉన్న హోటల్ ఆక్యుపెన్సీ సర్టిపికేట్ కూడా లేదని.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెల్లించాల్సిన పన్ను కూడా కట్టలేదని వివరించింది. 33.69 లక్షల పన్ను చెల్లించాల్సి ఉందని పేర్కొన్నది. దీంతోపాటు కరోనా లేకున్నా ఉన్నట్టు చిత్రీకరించి లక్షల్లో వారి నుంచి నగదు దండుకున్నారని వివరించింది. లేని వారికి కూడా చికిత్స పేరుతో ముక్కు పిండి నగదు వసూల్ చేసిందని తెలిపింది.
ఆస్పత్రి, హోటల్ సీజ్ చేయాలని సిఫారసు..
ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించనందున ఆస్పత్రితోపాటు హోటల్ సీజ్ చేయాలని జేసీ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కమిటీ నివేదికతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. స్వర్ణ ప్యాలెస్ ఆస్పత్రి, హోటల్ సీజ్ చేసే ఛాన్స్ ఉంది. విజయవాడలో రమేశ్ ఆస్పత్రి ఏర్పాటుచేసిన మరో కోవిడ్ సెంటర్పై కూడా చర్యలు తీసుకోనే అవకాశాలు ఉన్నాయి.