సీఐడీ నోటీసులపై హైకోర్టుకు చంద్రబాబు- క్వాష్ పిటిషన్ దాఖలు- ఎఫ్ఐఆర్ కొట్టేయాలని
తనపై దాఖలైన సీఐడీ అట్రాసిటీ కేసును సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సీఐడీ ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ తనపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం సరికాదని చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను కేబినెట్ తీర్మానం లేకుండా మార్చిన వ్యవహారంలో అప్పటి సీఎం, ప్రస్తుత విపక్ష నేత చంద్రబాబుపై అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని సీఐడీకి వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెలలో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 24న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన సీఐడీ.. 25న చంద్రబాబుతో పాటు మరికొందరిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
అమరావతి అసైన్డ్ భూముల మార్పిడి విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎఫ్ఐర్ నమోదు చేసిన సీఐడీ.. ఈ నెల 23న విజయవాడలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశముంది. మరోవైపు చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఈ కేసులో మరింత సమాచారం ఇచ్చేందుకు ఇవాళ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు.