సోషల్ మీడియా వేదిక చేసుకొని వేధింపులు, జగన్పై చంద్రబాబు విమర్శలు
ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నేతల లక్ష్యంగా కేసులు పెట్టడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అంశాలను పట్టుకొని కేసులు కట్టడం మంచి పద్ధతి కాదన్నారు. జగన్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. 100 రోజుల పాలనను ప్రజలు నిశీతంగా గమనించారని చంద్రబాబు తెలిపారు. ఆయన చెప్పిందేంటీ, చేస్తున్నదెంటీ అనే అంశాలను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు.. కేంద్ర మంత్రికి చంద్రబాబు లేఖ
ప్రజలకు సీఎం జగన్ మంచి చేస్తే ప్రశంసిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ తమ పార్టీ నేతలను వేధిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. ఏపీలో టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏ సెక్షన్ కింద కేసులు పెడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో అణచివేత ధోరణిని జగన్ సర్కార్ అవలంభిస్తుందని చంద్రబాబు విమర్శించారు.
తమను ఎంతగా అణగదొక్కాలని చూస్తే అంత రెచ్చిపోతామనే విషయాన్ని గుర్తించాలన్నారు. జగన్ సర్కార్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని తెలిపారు. సోషల్ మీడియా పోస్టులను చూపి అరెస్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే అంశాలకు సంబంధించి చట్టం అందరికీ ఒకేలా ఉందో లేదో పోలీసులు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ నేతలపై ఒకలా, వైసీపీ నేతలపై ఒకలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబు సూచించారు. ఏపీలో తాను సీఎంగా పనిచేశానని, ప్రతిపక్ష నేతగా ఉన్నానని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత పరిస్థితిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. నవ్యాంధ్రలో, ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి సిచుయేషన్ ఎప్పుడూ లేదని చంద్రబాబు తెలిపారు.