ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ: సాక్ష్యాలేవీ: చేతులెత్తేశారు: క్షమాపణ: టీడీపీ నేత
విజయవాడ: రాష్ట్ర రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ వివాదాలు కుదిపేస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టుల ఫోన్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ట్యాపింగ్కు పాల్పడుతోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ రాయడం, సాక్ష్యాధారాలను సమర్పించాలంటూ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ దానికి కౌంటర్ ఇవ్వడం.. వంటి పరిణామాలతో ఇప్పటికే వేడెక్కిన ఈ వివాదాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మరింత రాజేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్లో ట్విస్ట్: చంద్రబాబుకు డీజీపీ లేఖ: ఆధారాలు ఉంటే: మాస్టర్ స్ట్రోక్: బీజేపీ నేత
తమ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయలేదా? అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ ఇప్పటి ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపణలు చేశారని టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఫోన్లను ట్యాప్ చేశారని, దాన్ని ఆధారాలతో సహా తాము నిరూపించామని సజ్జల చెప్పడంలో అర్థం లేదని పేర్కొన్నారు.
న్యాయస్థానంలో కేసు వేసి, దాన్ని నిరూపించుకోలేక చేతులు ఎత్తేశారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. అవాస్తవాలను ప్రచారం చేయడంలో సజ్జల రామకృష్ణా రెడ్డి, హోం శాఖ మంత్రి సుచరిత గోబెల్స్ను మించి పోయారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సజ్జల న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, తీరా అధికారంలోకి వచ్చాక కూడా.. ఆ ఆరోపణలను నిరూపించుకోలేకపోయారని మండిపడ్డారు.
ఇదే అంశంపై వైవి సుబ్బారెడ్డి కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కేసును ఉపసంహరించుకున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంశం హోం మంత్రి సుచరిత తాజాగా చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో ఏ చర్యలు తీసుకున్నారో వివరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో లబ్ది కోసం కేసులు వేసారని బుద్ధా వెంకన్న విమర్శించారు.