ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు- సెప్టెంబర్ 26-అక్టోబర్ 5 వరకూ-పూర్తి వివరాలివే..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కలిపి పది రోజుల పాటు ఈ వేడుకలు జరగబోతున్నాయి. వరుసగా రెండేళ్ల పాటు కరోనా కారణంగా ఇబ్బందులు ఎదురై శరన్నవరాత్రులు కళతప్పిన నేపథ్యంలో ఈసారి ఘనంగా నిర్వహిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Recommended Video
ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు సంబంధించి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబ అనంతరం వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకూ దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది 10 రోజుల పాటు ఉత్సవాలు ఉంటాయన్నారు. పది రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారి దర్శనం ఉంటుందన్నారు. మూలా నక్షత్రం రోజున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుంటారని ఈవో తెలిపారు.
ఈ ఏడాది దసరా శరన్నవరాత్రుల నిర్వహణ కోసం నెల రోజుల ముందే సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లు ఈవో భ్రమరాంబ వెల్లడించారు. దసరా మహోత్సవాలకు టెండర్లు పూర్తయ్యాయని, ఘాట్ రోడ్డులో క్యూలైన్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయన్నారు. ఈ ఏడాది 80 లక్షలతో ప్రత్యేకంగా విద్యుద్ధీకరణ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా అంతరాలయ దర్శనాలు లేవన్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు.
భక్తులకు 100 రూపాయలు ,300 రూపాయలు , ఉచిత దర్శనాలు ఉంటాయని ఈవో తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనం ప్రతిపాదనల పై వచ్చే సమన్వయ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. 6+1 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతి మాదిరి నాణ్యత కలిగిన లడ్డూ ప్రసాదం అందిస్తామన్నారు. భక్తుల కోసం చండీహోమం, శ్రీచక్రనవావార్చన, కుంకుమార్చనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కుంకుమార్చనలో పాల్గొనే వారి కోసం 20 వేల టిక్కెట్లు ఆన్ లైన్ లో ఉంచామన్నారు. భక్తులకు సాంబారు, పెరుగన్నం, బెల్లంపొంగలి అందిస్తామన్నారు. గతంలో మాదిరిగానే నగరోత్సవం నిర్వహిస్తామని ఈవో తెలిపారు.
భవానీ భక్తులు దర్శనాలకు మాత్రమే రావాలని, భవానీల మాల వితరణకు అవకాశం లేదన్నారు. వాటర్ ప్యాకెట్స్ బదులు ఆర్వో వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతేడాది 9.50 కోట్లు ఆదాయం రాగా 3 కోట్లు ఖర్చయ్యిందని, ఈ ఏడాది 15 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. సౌకర్యాలు పెంచుతున్న నేపధ్యంలో 5 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నామన్నారు. 21 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచుతున్నట్లు ఈవో వెల్లడించారు.