ఏదో పొడిచేశామనుకుంటే ఎలా: ఎమ్మెల్సీ రిజల్ట్పై వైసీపీ ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవ్వాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద నిధులను విడుదల చేశారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 9.86 లక్షల మంది విద్యార్థుల కోసం 698.68 కోట్ల రూపాయలను ఆయన బటన్ నొక్కి విడుదల చేశారు. ఆ నిధులను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
వచ్చే రెండు సంవత్సరాల వ్యవధిలో కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ మరింత అభివృద్ధి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా విద్యార్థులకు వంద శాతం ఫీజురీయింబర్స్మెంట్ ఇస్తోన్నామని గుర్తు చేశారు. జగనన్న విద్యా దీవెన పథకంతో ఇప్పటి వరకు 9,947 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు వివరించారు. 27 లక్షల మంది పిల్లలకు లబ్ది కలిగించామని పేర్కొన్నారు.

ఈ సభలో వైఎస్ఆర్సీపీకి చెందిన తిరువూరు శాసన సభ్యుడు కొక్కిరగడ్డ రక్షణనిధి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీపై సెటైర్లు సంధించారు. తాము ఏదో పొడిచేశామని టీడీపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని, తాము ఎప్పటి నుంచో ఆ పని చేస్తోన్నామని ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నుంచే తాము టీడీపీని పొడుచుకుంటూ వస్తోన్నామని అన్నారు.
తిరువూరు నియోజకవర్గం నుంచే తాము సమరశంఖాన్ని పూరిస్తోన్నామని రక్షణనిధి సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే దీన్ని ఎదుర్కొనాలని అన్నారు. వైఎస్ జగన్ ఆదేశించినట్లుగా 175కు 175 సీట్లను సాధించి తీరుతామని, తమ పార్టీ జైత్రయాత్ర తిరువూరు నుంచే ఆరంభమౌతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ప్రతి గడపనూ వైఎస్ఆర్సీపీ పలకరిస్తోందని, దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది 2024 సార్వత్రిక ఎన్నికల్లో చూస్తారని అన్నారు.

శాసన మండలిలో స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ పార్టీ జెండా ఎగురిందని రక్షణనిధి గుర్తు చేశారు. ఏదో ఒకటి రెండు చోట్లు గెలిచి మురిసిపోవద్దని హెచ్చరించారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. ఏం చూసి టీడీపీకి ప్రజలు ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ప్రోటోకాల్ లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించారని విమర్శించారు.












Click it and Unblock the Notifications