స్వార్థం కోసం ఆంధ్రా వర్సిటీని.. గీతంకు అయితే ఓకేనా: విజయసాయి రెడ్డి
టీడీపీపై వైసీపీ ముఖ్య నేత విజయసాయి రెడ్డి పైరయ్యారు. పత్రికలో వచ్చిన ఓ కథనంపై ఘాటుగా స్పందించారు. ఆంధ్రా వర్సిటీని స్వార్థ రాజకీయాల కోసం, జర్నలిజం విలువలను పాతాళానికి దిగజారుస్తూ నీచానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గీతం ప్రైవేటు వర్సిటీ కోసం ఆంధ్రా యూనివర్సిటీని దిగజార్చవద్దని హితవు పలికారు.
అత్యధికంగా విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న ఆంధ్రా యూనివర్సిటీపై అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అన్ని కాన్సులేట్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఏయూతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని తెలిపారు. మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతోందని స్పష్టం చేశారు. అలాంటి ఆంధ్రా వర్సిటీపై ద్వేషం తగదని విమర్శించారు. చంద్రబాబు, బాలకృష్ణ బంధువుల గీతం వర్సిటీ మాత్రమే కళకళలాడాలి... అక్రమంగా వచ్చిన భూములతో విలువ వేల కోట్లకు చేరాలి అని సెటైర్లు వేశారు.
టీడీపీ హయాంలో ఏయూ వనరులను గీతంకు తరలించిన ఘనుడు ఎంవీఎస్ మూర్తి అని, ఏయూ మూతపడి విద్యార్థులు రోడ్డున పడాలని ఏయూని దెయ్యాల కొంప అని ఎంవీఎస్ మూర్తి అన్నారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. వీసీని కూడా అవమానించారని తెలిపారు. ఏయూ దూరవిద్య విభాగాన్ని నిర్వీర్యం చేసిన అప్పటి డైరెక్టర్ హరినారాయణ చౌదరి పదవీ విరమణ తర్వాత గీతంలో చేరాడని వివరించారు. టీడీపీ హయాంలో ఉస్మానియా, ఆంధ్రా వర్సిటీకి రాని నిధులు, యూజీసీ ప్రాజెక్టులు ప్రైవేటు యూనివర్సిటీ గీతంకు ఎలా వచ్చాయో వారికి తెలుసని పేర్కొన్నారు.