న్యూజెర్సీలో రైలు కింద తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: హన్మకొండవాసిగా గుర్తింపు
వరంగల్: అమెరికాలో మరో తెలంగాణవాసి ప్రాణాలు కోల్పోయారు. న్యూజెర్సీలో రైలు కింద పడి తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలయ్యారు. న్యూజెర్సీ ట్రాన్సిట్ ట్రైన్ విభాగం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తం రైలు కింద పడి దుర్మరణం పాలైనట్లు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం 7:20 నిమిషాలకు ఎడిసన్ స్టేషన్ వద్ద ఈ ఘటన సంభవించింది.
జోరుగా కరోనా వ్యాక్సినేషన్: 23 లక్షలమందికి టీకా: మీరెప్పుడు మొదలెడతారు మోడీజీ: రాహుల్
ఈ ఘటనతో ట్రెంటన్-మెట్రోపార్క్ స్టేషన్ల మధ్య కొన్ని గంటల పాటు ట్రాన్సిట్ ట్రైన్ సర్వీస్ రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చినట్లు తెలిపారు. మృతుడి పేరు ప్రవీణ్ దేశినేని. తెలంగాణలోని హన్మకొండకు చెందిన ప్రవీణ్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. న్యూజెర్సీలో ఆయన స్థిరపడ్డారు. ఆయన పని చేసే కార్యాలయం న్యూయార్క్లో ఉంది. రోజూ ఆయన ఎడిసన్ స్టేషన్ నుంచి ట్రాన్సిట్ ట్రైన్ ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. మంగళవారం ఉదయం ఆయన ఎప్పట్లాగే తన కార్యాలయానికి వెళ్లడానికి ఇంటి నుంచి బయలుదేరారు. 6:45 నిమిషాలకు ఎడిసన్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
నార్త్ ఈస్ట్ కారిడార్ మీదుగా ఆయన న్యూయార్క్ బయలుదేరాల్సి ఉంది. 8 గంటలకు ఆయన న్యూయార్క్లోని పెన్ స్టేషన్కు చేరుకోవాల్సి ఉంది. 7:20 నిమిషాలకు నంబర్ 3920 ట్రాన్సిట్ ట్రైన్ ఎడిసన్ స్టేషన్కు చేరుకోగా.. దాన్ని ఎక్కబోతూ అదుపు తప్పి కిందపడ్డారు. అదే సమయంలో రైలు కదలడంతో చక్రాల కింద నలిగిపోయారు. సంఘటనా స్థలంలో లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా స్టేషన్ అధికారులు ఈ సమాచారాన్ని ఆయన పనిచేసే కార్యాలయానికి అందజేశారు.
స్థానిక పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. న్యూజెర్సీలోని మిడిల్సెక్స్ రీజినల మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ దేశినేనికి ముగ్గురు సోదరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఘటనతో నార్త్ ఈస్ట్ కారిడార్ పరిధలోని ట్రెంటన్-న్యూయార్క్ పెన్ స్టేషన్ల మధ్య కొంతసేపు రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు న్యూజెర్సీ ట్రాన్సిట్ ట్రైన్ విభాగం అధికార ప్రతినిధి కేట్ థాంప్సన్ తెలిపారు.