నిధుల మళ్లింపు ఆరోపణలతో బాలవికాసపై ఐటీదాడులు; మంత్రి ఎర్రబెల్లి షాకింగ్ రీజన్!!
సేవ పేరుతో కోట్ల రూపాయల నిధులు దారి మళ్ళించారన్న ఆరోపణలతో బాల వికాస స్వచ్చంద సేవా సంస్థపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. అయితేమంత్రి ఎర్రబెల్లి ఐటీ దాడులకు షాకింగ్ కారణం చెప్పారు.
వరంగల్: వరంగల్ నగరంలో మరోమారు ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది నిరుపేదలకు సేవలందిస్తున్న వరంగల్ బాలవికాస స్వచ్ఛంద సంస్థ, అనుబంధ సంస్థలకు సంబంధించిన రికార్డులను ఐటీ అధికారులు నేడు తనిఖీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థలపై కొనసాగుతున్న దాడులలో భాగంగా వరంగల్ లోని బాలవికాస స్వచ్ఛంద సంస్థపై కూడా ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.

వరంగల్ బాల వికాస స్వచ్చంద సేవా సంస్థపై ఐటీ దాడులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బాలవికాస స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యాలయమైన హన్మకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్లోని కార్యాలయంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలవికాసకు సంబంధించిన ముఖ్య కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన కార్యాలయంతో పాటుగా సోమాజిగూడ లోని కార్యాలయంలోనూ, డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల ఉద్యోగుల నివాసాలలోను, కీసరలోని 28 ఎకరాలలో నిర్మించిన భారీ భవన సముదాయాలలోనూ అధికారులు సోదాలు చేపట్టారు.

సేవ పేరుతో కోట్ల రూపాయల నిధులు మాయం.. అందుకే సోదాలు
బాలవికాస స్వచ్చంద సేవ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరెడ్డి, ఆయన భార్య సునీత రెడ్డి, వ్యవస్థాపక డైరెక్టర్ థెరిస్సా కలిసి సంస్థకు వచ్చిన కోట్లాది రూపాయల ఎఫ్ సి ఆర్ ఏ నిధులను దారి మళ్లించి సొంతంగా వాడుకున్నారని, భూములు, ఇతర ఆస్తులు కొనుగోలు చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దృష్టి పెట్టి నేడు సోదాలు కొనసాగిస్తున్నారు.

బాల వికాసపై ఐటీ దాడులపై మంత్రి ఎర్రబెల్లి మండిపాటు
అయితే తాజా దాడుల పైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడుతున్నారు. బాల వికాస లాంటి సేవా సంస్థలపై ఐటీ దాడులు అమానుషం అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. బాలవికాస పై ఐటి దాడులను ఖండించిన మంత్రి ఎర్రబెల్లి గత 25, 30 ఏళ్లుగా దేశ, విదేశాల నుంచి నిధులు సమకూరుస్తూ, నిస్వార్థ ప్రజా సేవ చేస్తున్న సంస్థ బాల వికాస అని, ఈ సంస్థపై దాడులు బాధాకరం అన్నారు. బాలవికాస క్రిస్టియన్ మిషనరీ కి సంబంధించిన సంస్థ కావడం వల్లే ఐటీ దాడులు సాగుతున్నాయని పేర్కొన్నారు.

నిస్వార్థ ప్రజా సేవలను బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవాలని కుట్ర
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని, ప్రజాస్వామ్య దేశంలో కేంద్రంలోని బిజెపి మత రాజకీయాలకు పాల్పడుతుంది అనడానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇలాంటి దాడులతో బాల వికాస లాంటి సంస్థల నిస్వార్థ ప్రజా సేవలను బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. దేశ విదేశాల్లో ఎంతోమంది ప్రముఖులు ప్రశంసించిన, మారు మూల గ్రామాలకు సైతం రక్షిత మంచినీటితో పాటు, అనేక సేవలను అందిస్తున్న బాలవికాస సంస్థ పై ఐటీ దాడులు చేయడం అవమానకరమని ఆయన అభిప్రాయపడ్డారు. భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఆ సంస్థ సేవలను ఆపాలని ప్రయత్నిస్తున్నారని, కానీ అది సాధ్యం కాదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బీజేపీ తెలంగాణా రాష్ట్రంలో ఐటీ దాడుల కుట్రకు తెర తీసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.












Click it and Unblock the Notifications