కేసీఆర్ వరంగల్ టూర్ .. ప్రతిపక్షాల నేతలు హౌస్ అరెస్ట్ , టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి పరాభవం
వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒకపక్క ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎక్కడ సీఎం టూర్ ను అడ్డుకుంటారో అన్న అనుమానంతో పోలీసులు ప్రతిపక్ష పార్టీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు.ఆదివారం అర్ధరాత్రి నుంచే విద్యార్థి సంఘాల నేతలతో పాటు అనేక మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ప్రతిపక్ష పార్టీల నేతల హౌస్ అరెస్ట్ లు
హనుమకొండలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. హనుమకొండ లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ని తన నివాసంలోనే నిర్బంధించారు. అలాగే వరంగల్ అర్బన్ బిజెపి అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలను సైతం హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ని గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసులు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, ప్రధాన రహదారుల మీద ఆంక్షలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు ..టీఆర్ఎస్ఎస్ ఎమ్మెల్యేకు అనుమతి నిరాకరణ ..నడిచి వెళ్ళిన ఎమ్మెల్యే
ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి, అడ్డు కంచెలు వేసి సీఎం పర్యటించే ప్రాంతాలలో ఆంక్షలు విధించారు. ఇక ఈ ఆంక్షలు టిఆర్ఎస్ నాయకులకు సైతం ఇబ్బందులు కలిగిస్తున్నాయి .
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సైతం పోలీసుల తీరుతో చేదు అనుభవం ఎదురైంది. నర్సంపేట టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు అనుమతి లేదని నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. పోలీసుల తీరుపై తన నిరసన తెలియజేశారు.
Recommended Video
మరోమారు పెద్ది సుదర్శన్ రెడ్డికి అవమానం .. ఏకశిలా పార్క్ లోకి అనుమతి నిరాకరణ
అంతేకాదు ఏకశిలా పార్కు వద్ద ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన పెద్ది సుదర్శన్ రెడ్డికి మరోమారు చేదు అనుభవం ఎదురైంది. ఏకశిలా పార్కు లోనికి వెళ్లకుండా పోలీసులు పెద్ది సుదర్శన్ రెడ్డిని అడ్డుకోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసుల ఓవరాక్షన్ పై ప్రతిపక్ష పార్టీల నాయకులే కాకుండా అధికార పార్టీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జర్నలిస్టులకు సీఎం ప్రోగ్రాం ను కవర్ చేయడానికి పాస్ లు ఉన్నప్పటికీ పోలీసులు అనుమతించటం లేదు. దీంతో జర్నలిస్టులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications