దేశంలోనే తెలంగాణాలో మాత్రమే ఉచిత చేప పిల్లల పంపిణీ; మత్స్యకారులకు భరోసా: మంత్రి ఎర్రబెల్లి
వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మంత్రులు వర్షాకాలం కావడంతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని జోరుగా సాగిస్తున్నారు. మొన్నటికి మొన్న స్టేషన్ ఘనపూర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపపిల్లలను స్టేషన్ ఘనపూర్ చెరువులో వదిలితే , తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటలోని మాదన్నపేట చెరువులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు 6.32 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలన్న ఉద్దేశంతో, ఉచిత చేపపిల్లలను సరఫరా చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేదు.. తెలంగాణాలోనే ఉచిత చేపపిల్లల పంపిణీ : మంత్రి ఎర్రబెల్లి
మత్స్య శాఖ కార్మికులు గతంలో ఎన్నో కష్టాలను అనుభవించేవారని, కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ హయాంలోమత్స్య కార్మికుల కష్టాలు తీరాయని వారు ఆర్థికంగా ఎదిగారన్నారు.డబ్బులు పెట్టి చేపపిల్లలనుపెంచే స్తోమత లేని వారికి వంద శాతం సబ్సిడీ ఇచ్చిమత్స్య కార్మికుల కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
చేపల మార్కెటింగ్ కు కావాల్సిన శిక్షణ ఇస్తాం: ఎర్రబెల్లి
చేపల మార్కెటింగ్లో మహిళలను చైతన్యవంతులను చేయడానికి, మార్కెటింగ్రంగంలో అవసరమైన శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుస్పష్టం చేశారు. కాళేశ్వరం వల్ల 753 చెరువుల్లో 365 రోజులు నిండు కుండల్లా నీళ్లు ఉంటున్నాయని ఈ పరిస్థితిని మత్స్య కార్మికులు ఉపయోగించుకోవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మత్స్య కార్మికుల కోసం సొసైటీ ఏర్పాటు చేసి హక్కులు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
రాష్ట్రం ఆర్ధికంగా అభివృద్ధి కావటానికి నీటివనరులే కారణం : ఎమ్మెల్సీ బండా ప్రకాష్
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బండ ప్రకాష్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తెలంగాణ ముఖచిత్రం మారిందని, తెలంగాణ ప్రజల వృత్తి, జీవితాల పట్ల ముఖ్యమంత్రికి సంపూర్ణ అవగాహన ఉందని వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి కావడానికి నీటివనరులు దోహదపడతాయని పేర్కొన్న ఎమ్మెల్సీ బండ ప్రకాష్ తెలంగాణ ప్రజల కోసం కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారని అన్నారు. మత్స్యకార్మికులు కూడా ఆధునిక పద్ధతులను అవలంబించి లాభాల బాటలో ముందుకు నడవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు వేల సొసైటీలు ఉన్నాయని ఇంకా పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ లను చేపట్టామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం సీఎం ఎంతో చేస్తున్నారని బండ ప్రకాష్ వెల్లడించారు.