వరంగల్లో అదృశ్యమైన బీటెక్ విద్యార్థిని కోసం మూడు రోజులుగా గాలింపు.. టెన్షన్ లో తల్లిదండ్రులు
హన్మకొండలో బీటెక్ విద్యార్థిని అదృశ్యమైంది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బీటెక్ విద్యార్థిని మళ్లీ తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హన్మకొండలోని వాగ్దేవి కళశాలలో బీటెక్ సెకెండియర్ చదువుతున్న యువతి రోజుల క్రితం బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లింది. వరంగల్ చౌరస్తాలోని ఏటీఎం నుంచి రూ. 25 వేలు డ్రా చేసిన అనంతరం ఆచూకీ లేకుండా పోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే వరంగల్ అర్బన్ జిల్లా తిమ్మాపురం శివారు లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఎస్కే అతియా తబుస్సం 29వ తేదీ రాత్రి బయటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె జాడ తెలియరాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కంటికి సంబంధించిన బ్యాంక్ ఎటిఎం కార్డు నుండి ఏడు వేల రూపాయల నగదు తీసుకెళ్లింది.
అలాగే ఆ తర్వాత ఏటీఎం కార్డు తో వరంగల్లోని ఓ బ్యాంకు నుండి ఇరవై ఐదు వేలు కూడా డ్రా చేసుకొని వెళ్లిందని వారు తెలిపారు. ఆమె అదృశ్యంపై మూడు రోజులైనా, ఇప్పటి వరకు ఆచూకి తెలియక పోవడం పై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అతియా అదృశ్యానికి వెనుక ప్రేమ వ్యవహారమే కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.