నయా దందా: వరంగల్ లో రాజస్థానీ యువతులు.. జాతీయరహదారిపై వాహనదారులను ఆపి...
డబ్బు సంపాదనకు ఆడ, మగా అన్న తేడా లేకుండా ఎవరు పడితే వారు, ఏ పని పడితే ఆ పని చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కష్టపడి పని చెయ్యకుండా ఈజీగా డబ్బు సంపాదించటం కోసం చెయ్యకూడని పనులు చేస్తున్న వారు పెరిగిపోయారు. తాజాగా రాజస్థాన్ కు చెందిన కిలాడి లేడీ గ్యాంగ్ ఒకటి వరంగల్ జిల్లాలో హల్చల్ చేస్తుంది. ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై వచ్చే వాహనదారులను అడ్డగిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వరంగల్ - ఖమ్మం మధ్య రోజుకో చోట అడ్డా వేసి ఆ దారిన వెళ్లే వాహనదారులను ఆపుతూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు ఈ యువతుల ముఠా. ఇటీవల కాలంలో బొల్లికుంట సమీపంలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర దాదాపు 12 మంది సభ్యులు ఉన్న ఈ యువతుల గ్యాంగ్ వచ్చేపోయే వాహనదారులను ఆపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ లు వేసి రోడ్డు మీద తిరుగుతున్న ఈ గ్యాంగ్ వాహనదారులు డబ్బులు ఇచ్చే దాకా వారిని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు.
దీనిపై వాహనదారులు వారిని ప్రతిఘటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ సదరు రాజస్థానీ యువతులు తమ పద్ధతి మార్చుకోలేదు. హిందీలో మాట్లాడుతూ వాహనదారులు డబ్బులు ఇచ్చేదాకా వదలటం లేదు. అదే రోడ్డులో రోజుకు ఒక చోట ఉంటూ వాహనదారులను ఆపటం నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. వాళ్లకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అంటే, దానికి సమాధానం చెప్పకుండా, ఇవ్వాలి అంతే అంటూ వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారు. కొందరు ఇల్లు అద్దె కట్టుకోలేని స్థితిలో ఉన్నామని చెప్తుంటే, మరికొందరు స్వచ్చంద సంస్థ నిర్వహణ కోసం అంటూ చెప్తున్నారు.
దీంతో విసిగిపోయిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇల్లంద సమీపంలో డబ్బులు వసూలు చేస్తున్న సదరు యువతులను అరెస్ట్ చేశారు. వారంతా రాజస్థానీలుగా గుర్తించారు పోలీసులు. ఒకవేళ ఎవరికైనా ఇటువంటి వారు తారసపడితే, డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడితే, వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వరంగల్ పోలీసులు సూచిస్తున్నారు.