టీడీపీ- జనసేన ఉమ్మడి బహిరంగ సభ పేరు ఇదే..
TDP Janasena alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
ఇక ఈ రెండు పార్టీలు కూడా సంయుక్తంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి. ఉమ్మడి బహిరంగ సభలకు శ్రీకారం చుట్టనున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రా.. కదలిరా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోన్నారు. బహిరంగ సభలను నిర్వహిస్తోన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఆయన సభ ఏర్పాటైంది.

అదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ప్రజల్లోకి వెళ్తోన్నారు. శంఖారావం పేరుతో ఉత్తరాంధ్రలో జిల్లాల్లో పర్యటించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలల్లో నిర్వహించిన బహిరంగ సభలకు మంచి ఆదరణ లభించింది.
ఈ రెండు సభలకూ జనసేన దూరంగా ఉంటూ వచ్చింది. ప్రత్యక్షంగా ఆ పార్టీ రాష్ట్రస్థాయి నాయకులెవరూ పెద్దగా హాజరు కాలేదు. తాజాగా- అభ్యర్థుల ప్రకటనను జాయింట్గా ప్రకటించిన సందర్భాన్ని కొనసాగిస్తూ- బహిరంగ సభలను కూడా ఉమ్మడిగా నిర్వహించడానికి టీడీపీ-జనసేన సిద్ధం అయ్యాయి.
ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల ప్రతిపాడు వద్ద ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నాయి. ఈ నెల 28వ తేదీన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ సభలో ప్రసంగించనున్నారు. ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.
ఈ సభకు జెండా అని పేరు పెట్టాయి ఈ రెండు పార్టీలు కూడా. ఈ సభా వేదిక పనులను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ పలువురు టీడీపీ నాయకులు పరిశీలించారు. అనంతరం బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. సంక్షేమం, అభివృద్ధి తమ ఉమ్మడి అజెండాగా అభివర్ణించారాయన.
తెలుగు జన విజయ కేతనం జెండా పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని అన్నారు.












Click it and Unblock the Notifications