పార్ట్-37
బయట రోడ్డు మీద బైఠాయించిన జర్నలిస్టుల్లో అసహనం పెరిగిపోతుంది. ఇంతకు ముందెప్పుడూ వాళ్లు అలా రోడ్డు మీద బైఠాయించారు. బచావత్ అవార్డు అమలు కోసం ర్యాలీ తీసినా, పత్రికా స్వేచ్ఛ కోసం ప్రదర్శన నిర్వహించినా వారికి అదో సరదాలా ఉండేది. సిగరెట్లు తాగుతూ ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ, జోక్లు వేసుకుంటూ వాటిలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడలా లేదు. రోడ్డున పడ్డ కార్మికుల్లా ఉన్నారు. భయం భూతం ఆవహించిన రోగుల్లా ఉన్నారు. ఆగ్రహం చెందిన సింహాల్లా ఉన్నారు.
ఒక నాయకుడు రమేష్ బయటకు వచ్చి సిఎం గేటు ద్వారం వద్ద నిలబడ్డాడు. అందరూ అతని వైపు ఆసక్తిగా చూశారు. ఏం చెప్తాడో విందామని చెవులు రిక్కించారు. కొద్దిసేపు అందరినీ పారజూశాడు రమేష్. గొంతు సవరించుకున్నాడు. మాట్లాడటం మొదలుపెట్టాడు. ''వినిపించడం లేదు'' అని అరిచారు కొందరు చివరి నుంచి. మరోసారి గొంతు సవరించుకుని ఉపోద్ఘాతం ప్రారంభించాడు. ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండించాడు. ప్రభుత్వ దమననీతిని విమర్శించాడు. ''అవన్నీ సరే, సిఎం ఏమన్నాడో చెప్పు'' అని ఎవరో అరిచారు. ఆ మాటలన్న వైపు అందరూ చూశారు. కానీ ఎవరన్నారో ఎవరూ గుర్తు పట్టలేకపోయారు.
''సరే, చెప్తా. ఎన్కౌంటర్పై జ్యుడిష్యల్ ఎంక్వైరీ జరిపిస్తానని హామీ ఇచ్చాడు సిఎం'' అని చెప్పాడు.
''ఎక్స్గ్రేషియా ఏమన్నాడు?'' మళ్లీ ఎవరో ప్రశ్నించారు.
''హోం మినిస్టర్ను తొలగిస్తాడా, లేదా?'' ఇంకెవరో అడిగారు.
రమేష్ కాస్తా ఆగాడు. ఏం చెప్పాలో అర్థమైనట్లు లేదు. ''జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాతే మిగతా హామీల గురించి పరిశీలిస్తానని, ఎంక్వైరీలో తప్పని తేలితే పోలీసాఫీసర్లను బదిలీ చేస్తానని చెప్పాడు'' అని చెప్పాడు.
ఒక్కసారిగా కలకలం రేగింది. దీనికి ఒప్పుకోవద్దంటూ అన్ని వైపుల నుంచి అరుపులు. సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. రమేష్ ప్యాంట్ జేబులోంచి కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు. నినాదాలు ఆగలేదు. ''మీరు అమ్ముడుపోతున్నారా?'' అని గుంపులోంచి ఎవరో అరిచారు.
రమేష్ మళ్లీ లోనికి వెళ్లాడు. జర్నలిస్టులు గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకోసాగారు. వారి ముఖాల్లో అలసట, ఆగ్రహం కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
