అభ్యుదయ సాహిత్య సభలు
అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 13వ జాతీయ మహాసభలు హైదరాబాద్లో జరుగనున్నాయి. ఈ సభలు ఏప్రిల్ 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్నాయి. అరసం జాతీయ మహాసభలు దక్షిణ భారతదేశంలో జరగడం ఇదే ప్రథమం. ఆ గౌరవం హైదరాబాద్కు దక్కుతోంది.
ఈ శతాబ్దపు సాహిత్యాన్ని శక్తివంతంగా ప్రభావితం చేసిందీ, ప్రగతిశీల దిశను నిర్దేశించిందీ అభ్యుదయ సాహిత్యోద్యమమని అరసం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ అన్నారు. 1936 నాటికే అభ్యుదయ సాహిత్యోద్యమం జాతీయ స్థాయిలో నిర్మాణ రూపాన్ని తీసుకుంది. రాష్ట్రంలో సంస్థాగత వేదికను రూపొందించుకుని అరవై యేళ్లయింది. ఇది అరసం వజ్రోత్సవ సంవత్సరం. 1943 నుంచి అరసం ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలంగా పని చేస్తోంది. జాతీయ స్థాయిలో అరసంతో మున్షీ ప్రేమ్చంద్, సజ్జాద్ జహీర్, అలీ సర్దార్ జాఫ్రీ వంటి మేటి రచయితలుండేవారు. రాష్ట్రంలో హేమాహేమీలైన మఖ్దూం మొహియుద్దీన్, తాపీ ధర్మారావు, రాజమన్నారు, అబ్బూరి, దాశరథి, తుమ్మల, శ్రీశ్రీ వంటి రచయితలు అరసంతో ఉండేవారు.
ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకు జరిగే జాతీయ మహాసభలకు ముల్కరాజ్ ఆనంద్, భీష్మ సహానీ, మహాశ్వేతాదేవి, అరుంధతీరాయ్, జావేద్ అక్తర్ వస్తున్నారు. ప్రముఖ సాహితీవేత్తలు కేతు విశ్వనాథ రెడ్డి, దాశరథి రంగాచార్య, తదితర తెలుగు రచయితలు ఈ సభల్లో చురుగ్గా పాల్గొంటారు.