వన్ ఇండియా ఎడిటర్కు పురస్కారం
హైదరాబాద్: వన్ ఇండియా తెలుగు సంపాదకుడు కాసుల ప్రతాప రెడ్డికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం లభించింది. తెలుగు భాషలో, తెలుగు సాహిత్యం విమర్శలో చేసిన కృషికి గాను ఆయనకు 2011 సంవత్సరానికి గాను అబ్బూరి రామకృష్ణారావు - అబ్బూరి వరదరాజేశ్వర రావు స్మారక పురస్కారం లభించింది. ఈ నెల 31వ తేదీన హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని నందమూరి తారకరామారావు కళామందిరంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది.
అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్సి యం.జి. గోపాల్, సాంస్కృతిక శాఖ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి హాజరవుతారు. వివిధ రంగాల్లో కృషి చేసినవారికి వారు అవార్డులు ప్రదానం చేస్తారు.
కాసుల ప్రతాపరెడ్డి రాసిన ఎల్లమ్మ, ఇతర కథలు సంకలనానికి గతంలో సురమౌళి స్మారక పురస్కారం లభించింది. ఆయన కథాసాహిత్యంలో శిలువకు తొడిగిన మొగ్గ, ఎల్లమ్మ, ఇతర కథలు వచ్చాయి. తెలుగు నవల - వ్యాపార ధోరణి (ఎంఫిల్) సిద్ధాంత గ్రంథం బహుళ ప్రజాదరణ పొందింది. భౌగోళిక సందర్భం, కొలుపు, ఇరుసు అనే సాహిత్య విమర్శనా గ్రంథాలను ఆయన వెలువరించారు. తెలంగాణ రాజకీయాలపై రాసిన వ్యాసాలతో తెలంగాణ సందర్భాలు అనే పుస్తకం కూడా వెలువడిండి.
వందలాది సాహిత్య విమర్శనా వ్యాసాలు, సమీక్ష వ్యాసాలను ఆయన రాశారు. తెలంగాణ తోవలు, తెలంగాణ కథ - దేవులాట వంటి పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పలువురు రచయితల పుస్తకాలకు ముందుమాటలు కూడా రాశారు. ప్రస్తుతం వన్ ఇండియా తెలుగు పోర్టల్కు ఆయన సంపాదక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉదయం దినపత్రిక, ఆంధ్రప్రదేశ్ టైమ్స్ ఆంగ్ల దినపత్రికలకు సీనియర్ రిపోర్టర్గా పనిచేశారు. సుప్రభాతం సామాజిక, రాజకీయ వారపత్రికకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు.
నల్లగొండ జిల్లా రాజాపేట మండలంలోని మారుమాల గ్రామం బొందుగులలో 1962 జులై 10వ తేదీన జన్మించిన ప్రతాప రెడ్డి తెలుగు సాహిత్యంలో ఎంఎ, ఎంఫిల్ పట్టా పొందారు. ఛత్తీస్ఘడ్ ఉద్యమకారుడు శంకర్ గుహ నియోగిపై ఉద్యమమే జీవితమై.. అనే పేర తెలుగు అనువాద గ్రంథాన్ని వెలువరించారు. గుక్క అనే కవితా సంకలనం ఆధునిక తెలంగాణ కవితా సాహిత్యంలో పేరెన్నిక గన్నది. తెలంగాణ కవిత్వానికి ఒరవడి దిద్దిన కవిత్వంలో ఇది కూడా ఒక్కటి.