'మరణానంతర జీవితం' పై కొన్ని మాటలు

సమాజాన్ని నియంత్రించే యంత్రాంగాల గుట్టు మట్లు తెలిసిన నందిగం కృష్ణారావు, సమాజం ముందు వాటి నేరాలను చెప్పే 'సాక్షి'గా కనిపిస్తారు. కేసుల్లో నిర్భయంగా సాక్ష్యం చెప్పగల చేవను కలిగి ఉండడమే పెద్ద సాహసం. కృష్ణారావు రచయితగా ఆ పని చేస్తున్నారు.
కథలే కాకుండా, ఇంతకు ముందు రాసిన 'చీకట్లో నల్లపిల్లి' నవల, ఇప్పటి 'మరణం తర్వాత..' నవల విశాలమైన కాన్వాసును మన ముందు నిలుపుతాయి. అలవోకగా, అప్రయత్నంగా ప్రారంభమైనట్లు కనిపించి, ఓ మంత్ర నగరి మాయాజాలంతో మొదలు పెట్టి ఆయన సమాజం ఇరుకు సందుల్లోకే కాకుండా మనుషుల ఇరుకు మనస్సులోకి నడిపించుకుని పోతారు. ఆయన దారి చూపుతుంటే పాఠకులు ఎప్పుడేమవుతుందో, అలా జరగకపోతే బాగుండేమో అనిపిస్తూ వుంటుంది. కానీ, సత్యం అదే. సత్యాన్ని తప్పించుకుని పోవడం మన వల్ల కాదు.
'మరణానంతర జీవితం' చదువుతుంటే, మనకు తెలియని బీభత్స మనోవల్మీకాలు మనల్ని వెంటాడి, మన నీడ మనల్నే మోసం చేసే వైనాన్ని కళాత్మకంగా చెబుతుంది. పరిస్థితులకు మనుషులు ఎలా దాసోహమవుతారో, ఆ దాసోహం చేయడానికి మనల్ని నడిపిస్తున్న శక్తులేమిలో ఈ నవల చదివితే కచ్చితంగా తెలిసిపోతుంది. విలువలను, శక్తులను తిరగేయాల్సిన అవసరాన్ని కూడా మనకు గుర్తు చేస్తుంది.
- కాసుల ప్రతాపరెడ్డి
(నందిగం కృష్ణారావు 'మరణం తర్వాత..' నవలకు రాసిన ముందుమాట)












Click it and Unblock the Notifications