రియాలిటీ చెక్: ఆంధ్రలో టీ రచయితలు
హైదరాబాద్: జర్నలిస్టు, రచయిత పూడూరి రాజిరెడ్డి కొంత మంది తెలంగాణ రచయితలకు మంచి అవకాశాన్ని కల్పించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పర్యటించే అవకాశాన్ని ఆయన కల్పించారు. ఈ నెల 5వ తేదీన ఆయన పుస్తకం రియాలిటీ చెక్ ఆవిష్కరణ గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. హైదరాబాద్కు సంబంధించి వైవిధ్య భరితమైన జీవన విధానాలను, శైలులను వారం వారం కాలమ్గా రాసిన రియాలిటీ చెక్ ఆర్టికల్స్ను తెనాలి ప్రచురణలు సంస్థవాళ్లు అచ్చేసి, దాని ఆవిష్కరణను తెనాలిలో పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కొంత మంది తెలంగాణ రచయితలను పూడూరి రాజిరెడ్డి అక్కడికి తీసుకుని వెళ్లారు.
ఐదో తేదీనాడు జనతా ఎక్స్ప్రెస్లో చింతపట్ల సుదర్శన్, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన మద్దికుంట లక్ష్మణ్, సి. అనంత్, జి. ఉమామహేశ్వర రావు, చిత్రకారుడు రమణజీవి, చరిత గ్రాఫిక్స్ అధినేత సుబ్బయ్య, నేను పూడూరి రాజిరెడ్డితో పాటు తెనాలి చేరుకున్నాం. కరీంనగర్ జిల్లా మంచిర్యాల నుంచి అల్లం రాజయ్య విచ్చేశారు. సాయంత్రం పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రారంభమయ్యే సరికి ఉమామహేశ్వర రావు దిగిపోయాడు.
రియాలిటీ చెక్ పుస్తకాన్ని అల్లం రాజయ్య ఆవిష్కరించారు. ప్రముఖ న్యాయవాది నాగేశ్వర రావు అధ్యక్షత వహించారు. తెనాలి ప్రచురణలు సంస్థకు చెందిన సురేష్, సుధామయి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేం చాలా మంది పుస్తకం గురించి తోచింది మాట్లాడాం. మర్నాడు, కొంత మంది తిరిగి వెళ్లిపోగా, నేను, రఘోత్తమ రెడ్డి, లక్ష్మణ్, చింతపట్ల సుదర్శన్, రఘోత్తమరెడ్డి, పూడూరి రాజిరెడ్డి సుధామయితో కలిసి గుంటూరు జిల్లాలోని వివిధ పర్యాటక స్థలాల సందర్శన కోసం వెళ్లాం.
రియాలిటీ చెక్ ఆవిష్కరణ
తెనాలిలో జరిగిన రియాలిటీ చెక్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ రచయిత అల్లం రాజయ్య. చిత్రంలో పుస్తక రచయిత పూడూరి రాజిరెడ్డి, నాగేశ్వర రావు, సురేష్లను చూడవచ్చు.
ఉండవల్లి గుహాలయం వద్ద..
ఉండవల్లిలో చాళుక్యుల కాలంలో చెక్కిన నాలుగంతస్థుల భవనాన్ని గుహాలయంగా నామకకరణఁ చేశారు. అది అద్భుతమైన ఆలయంగా రూపుదిద్దుకుంది. అక్కడ రచయితలు ఇలా...
అమరావతిలో ఇలా..
అమరావతి మ్యూజియాన్ని సందర్శించిన తర్వాత రచయితలు ఇలా.. బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించి కొంత జ్ఞాన బోధ జరిగినట్లుగా..
ఉప్పలపాడులో..
వలస పక్షులతో దైవం తీసిన చిత్రంగా ఉప్పలపాడు దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తుంటే ఓ అద్భుతమైన దృశ్యం కళ్లకు కడుతుంది.
తెనాలి నుంచి అమరావతికి బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికి ఇది మా వూరు అంటూ సుధామయి ఆత్మీయంగా కొలకులూరును చూపించారు. అక్కడి నుంచి నేరుగా ఉప్పలపాడు వెళ్లాం. అది ఓ అద్భుతమైన దృశ్యాన్ని ఉప్పలపాడు ఆవిష్కరించింది. సైబీరియా నుంచి యేటా పక్షులు ఇక్కడికి వలస వస్తాయట. వివిధ జాతుల కొంగలు, బాతులతో పాటు కొన్ని కోళ్లు కూడా అక్కడ కుప్ప పోసినట్లుగా దర్శనమిచ్చాయి. పక్షులు ఆకాశంలో విహరిస్తూ ఉంటే అద్భుతమైన దృశ్యం నేత్రపర్వం చేసింది.
అక్కడి నుంచి అమరావతి చేరుకున్నాం. అక్కడ సుధామయి ప్రత్యేకంగా చేసి తీసుకుని వచ్చిన ఆహార పదార్థాలు భుజించిన తర్వాత అమరావతి చారిత్రక విశేషాలను చూశాం. మ్యూజియంలో సేకరించి పెట్టిన కళాఖండాలు గతవైభవాన్ని గుర్తు చేస్తూ కనిపించాయి. అక్కడి నుంచి రఘోత్తమ రెడ్డి గుంటూరు వెళ్లాలంటూ మమ్మల్ని విడిచిపోయారు.
అక్కడి నుంచి ఉండవల్లి వచ్చాం. ఉండవల్లిలో 4,5 శతాబ్దాలనాటి అద్భుతమైన రాతి చెక్కడంతో కూడిన నాలుగు అంతస్థుల భవనం కనుల విందు చేయడమే కాకుండా అబ్బురపరిచింది. కొండను తొలచి నాలుగు అంతస్థుల భవనాన్ని చాళుక్యకాలంలో నిర్మించారు. అందులో అతి పెద్ద అనంతశయన పద్మనాభ స్వామి శయనించిన విగ్రహం ఆశ్చర్యచకితులను చేసింది. ఆ తర్వాత మంగళగిరి పానకాల లక్ష్మినరసింహస్వామి ఆలయం, విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం మీద దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించుకుని పుస్తక ప్రదర్శనను కూడా చూసేసి వెనక్కి తిరిగాం. ఈ యాత్రలో మా వెంట నెల్లూరు జిల్లాకు చెందిన పద్మాకర్ చివరంటా ఉన్నారు.
మొత్తం మీద, తెనాలి ప్రచురణలు సంస్థకు చెందిన ఆత్మీయ స్పర్శ మమ్మల్ని ఆనందపరవశులను చేసింది. పూడూరి రాజిరెడ్డి హైదరాబాద్ జీవితాల గురించే రాసినా అవి ఎల్లలు దాటి విశ్వజనీనతను చాటుకున్నాయనే విషయం మరోసారి అనుభవంలోకి వచ్చింది. రియాలిటీ చెక్ రచనలను అందరూ వినూత్నమైన వచన ప్రక్రియగా ప్రశంసించారు. వాస్తవిక జీవితాలను అలతి అలతి పదాలతో, వాటికి రంగును రుచిని అద్ది పూడూరి రాజిరెడ్డి అందించారు. వాస్తవికతకు మార్మికత అద్ది, దాని ద్వారా వాస్తవికతను తిరిగి చూపించారు.
- కాసుల ప్రతాప రెడ్డి