కవిస్వరం: చక్రవాకం
జ్యోతిర్మయి మళ్ల ఓ విషాద కవితను రాగంతో మిళితం చేసి మనకు అందించారు. కొత్త వ్యక్తీకరణలతో ఆమె కవితను ప్రాణవంతం చేశారు. పాటకి గొంతు పుట్టిళ్లు, గుండె గోడలెంత బలహీనమో అని అనడం ద్వారా ఓ వాతావరణాన్ని కల్పించి పాఠకులను ఆకర్షిస్తున్నారు. ఆమె విషాద గీతం గురించి ఈ కవితలో మాట్లాడినట్లు కనిపిస్తున్నారు.
విషాద గీతానికీ, జీవిత విషాదానికి దేహం చెందే మార్పులను అన్వయిస్తూ చివరి వరకు పట్టు సడలకుండా కవితను నడిపించారు. స్వరాలు లయమై రాగమై చక్రవాకమై అని అనడం ద్వారా నిరీక్షణకు సంబంధించిన విషాదాన్ని ఆమె కవితలో రూపుకట్టినట్లు భావించవచ్చు. చక్రవాక పక్షిలా ఎదురు చూడడంలోని విషాద మాధుర్యాన్ని ఆమె పలికించారు.
మూడో స్టాంజాను, ఐదో స్టాంజాను అన్వయించుకుంటే ఈ కవితలోని సామంజస్యం అర్థమవుతుంది. బాధ ఉధృతమై కట్టు తెగి/ గొంతులోకి ప్రవహించి/ స్వరపేటికను చుట్టుముట్టి/ అక్కడ గడ్డ కట్టేస్తుంది/ అంతటితో పాట ఆగిపోతుంది అని దాన్ని ఐదో స్టాంజాకు అనుసంధానం చేస్తూ రెండు పాదాలు రాసి గొంతును పూడ్చిన బాధ ఊరక ఉండదు/ కరిగి కన్నీటి పరమై/ చెంపలపై కురుస్తుంది అని చెబుతారు. తద్వారా ఒక అమూర్త భావన తాలూకు ప్రతిస్పందన మూర్త రూపంలో బయటపడడాన్ని ఆమె తన కవితలో వ్యక్తీకరించారు. రాగానిదీ ప్రయాణమే/ అదీ ఓ జీవితమే అంటూ జీవితానికి, రాగానికీ అభేదం చెబుతారు. ఏమైనా, భావనాత్మక ప్రపంచంలోకి తీసుకుని వెళ్తున్నట్లే కవిత ప్రారంభమై భౌతిక ప్రపంచంలోకి ప్రయాణం చేస్తుంది.
- కాసుల ప్రతాపరెడ్డి

పాటకి గొంతు పుట్టిల్లు
స్వరాలు లయమై రాగమై చక్రవాకమై
గానమై నాదమై
గాలిలో మిళితమైతే న్యాయమే
లోలోపలికి పాకి ఆత్మను తాకి
గుండెను కదిలించి
పేరుతెలియని బాధనేదో పుట్టించడం అన్యాయం
గుండె గోడలెంత బలహీనమో
ఇట్టే పగిలి పోతాయి
బాధ ఉధృతమై కట్లు తెగి
గొంతులోకి ప్రవహించి
స్వరపేటికను చుట్టుముట్టి
అక్కడ గడ్డకట్టేస్తుంది
అంతటితో పాట ఆగిపోతుంది
రాగానికెంత బలమో
ఇట్టే బంధించేస్తుంది
గొంతును పూడ్చిన బాధ ఊరక ఉండదు
కరిగి కన్నీటి వర్షమై
చెంపలపై కురుస్తుంది
రాగానిదీ ఓ ప్రయాణమే
అదీ ఒక జీవితమే
- జ్యోతిర్మయి మళ్ళ












Click it and Unblock the Notifications