కింగ్ కొహ్లీ ఈజ్ బ్యాక్..! నాలుగేళ్ల తర్వాత ఐసీసీ ర్యాంకుల్లో టాప్..!
టీమిండియా క్రికెట్ దిగ్గజం, కింగ్ విరాట్ కొహ్లీ తాజా ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటుకున్నాడు. గతేడాది టీమ్ లో స్ధానం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించిన కొహ్లీ అందుకు తగ్గ ఫలితం రాబట్టుకొన్నాడు. వరుస సెంచరీలు, హిట్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపిన కొహ్లీ.. తాజాగా ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టాప్ లో నిలిచాడు. అంతే కాదు నాలుగేళ్ల తర్వాత మళ్లీ వన్డే ర్యాంకుల్లో టాప్ గా నిలిచి సత్తా చాటుకున్నాడు.
ఐసీసీ వన్డే ర్యాంకుల్లో గతంలో సుదీర్ఘకాలం విరాట్ కొహ్లీ టాప్ లో ఉన్నాడు. అయితే 2021 జూలైలో పేలవ ఆటతీరుతో ర్యాంకింగ్స్ లో క్రమంగా దిగజారాడు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కింగ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. తాజాగా వడోదరలో న్యూజీలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 91 బంతుల్లో 93 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించిన కొహ్లీ.. ఈ క్రమంలో తన సహచరుడు రోహిత్ శర్మను కూడా దాటిపోయాడు.

తాజాగా ఫామ్ లోకి వచ్చేసిన విరాట్ కొహ్లీ.. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానానికి ఎగబాకడం ఇది 11వ సారి. గతేడాది నవంబర్-డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో 135, 102, 65 స్కోర్లు చేసిన కొహ్లీ.. అక్టోబర్లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై 74 నాటౌట్గా నిలిచాడు. అలాగే తన చివరి ఐదు వరుస ఇన్నింగ్స్లలో యాభై పరుగుల మార్కును దాటాడు. ఈ ఐదు మ్యాచ్ల్లో ఏకంగా 469 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

దీంతో కోహ్లీ 785 పాయింట్లు సాధించి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. సహచరుడు రోహిత్ శర్మను దాటిపోయిన కొహ్లీ.. అతన్ని మూడో స్దానానికి నెట్టేశాడు. రోహిత్ 775 పాయింట్స్ తో మూడవ స్థానానికి పడిపోయాడు. గతంలో కోహ్లీ తొలిసారి 2013 అక్టోబర్ లో వన్డే ర్యాంకింగ్స్లో టాప్ కు చేరాడు. అప్పట్లో 825 రోజుల పాటు నంబర్ 1 స్థానంలో కొనసాగాడు. ఏ భారతీయ బ్యాట్స్మన్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.












Click it and Unblock the Notifications