ఎన్టీఆర్ బాటలో చిరు!

రాజకీయాల్లో ఫ్లాప్ అయిన ఆయన మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోతారన్న వదంతులు నిజం కావు. అయితే ఐదేళ్ళ పాటు చిరంజీవి పార్టీకి ఫుల్ టైమ్ సేవలు అందించగలరా? పార్టీపై అంకితభావంతో ముందుకు వెళ్ళాలని ఆయన అనుకుంటున్నారు. కానీ ఇంతకాలం అల్లు అరవింద్ కనుసైగల్లో ఉన్న చిరంజీవి ఇప్పుడు సొంతంగా వ్యవహరించడం కష్టమే. పార్టీ టికెట్లను అమ్ముకున్నారన్న ఆరోపణలను చిరంజీవి సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయారు. దీనిపై విచారణకు కూడా ఆయన సిద్ధం కాలేదు.
రైలింజన్ గుర్తు సరిగ్గాలేకపోయినా, పార్టీ సంస్ధాగతంగా బలపడకపోయినా 17 శాతం ఓట్లు రాబడం విశేషమని చెబుతున్నారు. అందుకే ఐదేళ్ళ తర్వాత అయినా తానే ముఖ్యమంత్రినన్న నమ్మకంతో ఎక్కువ సమయాన్ని పార్టీకి కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాము అధికారంలోకి రాబోవడం లేదని పక్కా సమాచారం చిరంజీవికి ఎన్నికలు ముగిసినప్పడే ఉంది. అయితే ఆయన హంగ్ అసెంబ్లీ వస్తుందన్న ఆశల్లో ఉండేవారు. మధ్యంతర ఎన్నికలు వస్తే ప్రజారాజ్యంని అధికారంలోకి తీసుకురాగలనన్న నమ్మకం ఆయనకు ఉండేది. కానీ కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ తెచ్చుకోవడం, వైఎస్ ఇమేజ్ బాగా పెరగడం ప్రజారాజ్యం మనుగడకు అడ్డంకి కలిగించే విషయాలే. టికెట్ కొనుక్కుని రైలు ఎక్కిన తర్వాత మధ్యలో ఎలా దిగిపోలేమో చిరంజీవి పరిస్ధితి కూడా అంతే ఉంది. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగక తప్పని పరిస్ధితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications