విభజనపై చంద్రబాబు తటస్థుడా?
రాష్ట్ర అవతరణ దీనోత్సవ ప్రసంగంలో చంద్రబాబు తన తెలంగాణ వ్యతిరేక వైఖరిని, సమైక్యాంధ్ర అనుకూల వైఖరిని బయట పెట్టుకున్నారు. పార్టీ వైఖరిని ప్రతిబింబించాల్సిన పార్టీ అధ్యక్షుడు అందుకు భిన్నంగా మాట్లాడడం, వ్యవహరించడం ఇదే తొలిసారి కావచ్చు. ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం బూర్గుల రామకృష్ణారావు పదవీ త్యాగం చేశారని ఆయన చెప్పారు. తెలుగుజాతి మూడు వేల సంవత్సరాలుగా కలిసి ఉందని, కేవలం 150 సంవత్సరాలు మాత్రమే విడిపోయి ఉందని చెప్పారు. తద్వారా ఆయన తన రాష్ట్ర విభజన వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకున్నారు. ఇది తటస్థ వైఖరి ఎంత మాత్రమూ కాదని అంటున్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీ నాయకుడు, చంద్రబాబు నాయుడి బావమరిది నందమూరి బాలకృష్ణ కూడా సమైక్యాంధ్ర రాగం వినిపించారు. రాష్ట్రావతరణ రోజు ఆయన ఓ కార్యక్రమంలో రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకున్నారు. చంద్రబాబు తెలంగాణ అనుకూల వైఖరి తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో బాలకృష్ణ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు వ్యవహరిస్తే పార్టీ చీలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని అంటున్నారు. ఎన్టీ రామారావు మరో కుమారుడు నందమూరి హరికృష్ణతో పాటు బాలకృష్ణలతో పాటు సీమాంధ్ర నాయకులు చంద్రబాబు తల మీదికి కుంపటిని తెచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.