దక్షిణాది రాష్ట్రాలకు సమ్మె ఎఫెక్ట్
మహారాష్ట్రలోని మూడు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గటంతో పరిమితంగానే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరోవైపు తమిళనాడులో 20 శాతం ఉత్పత్తి తగ్గిపోయింది. కర్నాటకలో 6400 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా కేవలం 5400 మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీంతో బెంగళూరులో రోజుకు నాలుగైదు సార్లు విద్యుత్ కోత విధిస్తున్నారు. కేరళలో 400 మెగావాట్ల విద్యుత్ కొరత, ఆంధ్రప్రదేశ్లో 1400 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లోని పలు విద్యుత్ ప్లాంట్లు చిన్న చిన్న సంస్థల నుండి బొగ్గును కొనుగోలు చేస్తున్నప్పటికీ సమస్య తీవ్రత తగ్గటం లేదట.
విద్యుత్ కొరత పరిశ్రమలు, వ్యవసాయరంగం, ఐటి రంగంపై తీవ్రంగా పడుతోంది. విద్యుత్ కొరత కారణంగా ఐటి రంగం తీవ్రంగా నష్టపోతుందని సమాచారం. కేరళ ప్రభుత్వం ఇప్పటికే వినియోగదారులకు విద్యుత్ కోత విధిస్తోంది. ఇక మన రాష్ట్రంలో పట్టణాలు, మున్సిపల్, గ్రామాల వారిగా రోజుకు నాలుగు, ఎనిమిది, పది గంటల చొప్పున విద్యుత్ కోత విధిస్తున్నారు. రాయలసీమ విద్యుత్ ప్లాంటు సామర్థ్యం 1200 మెగావాట్లు కాగా కేవలం 800 మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే లక్ష టన్నుల సిఐఎం నుండి మంజూరు చేయించుకుంది. మరికొంత కావాలని ప్రభుత్వం అడగటంతో మిగిలిన రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయట.