పారిశ్రామికవేత్తలకు కెసిఆర్ రెడ్ కార్పెట్ (పిక్చర్స్)
హైదరాబాద్: పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెబుతున్నారు. పరిశ్రమల స్థాపనకు అన్నివిధాలా సహకరిస్తామని భరోసా ఇస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో ఐదు లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కూలిచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఎయిర్పోర్ట్ సిటీ సహా హైక్లాస్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మిస్తామంటూ జీఎంఆర్ చేసిన ప్రతిపాదనపైనా ఆయన సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజి పెంచేలా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఎయిర్పోర్ట్ సిటీ సహా హైక్లాస్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మిస్తామని జీఎంఆర్ సంస్థ ప్రతిపాదించింది. తాము ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్ సిటీ నిర్మాణం ద్వారా 15 నుంచి 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించింది. ఈ రెండిటి నిర్మాణంతో వివిధ రంగాల మధ్య ఆర్థిక పరిపుష్టతకు అవకాశం ఏర్పడుతుందని చెప్పింది.
బిజినెస్ స్కూల్ ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బిజినెస్ స్కూల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నోవాటెల్లో జరిగింది.
కెసిఆర్తో జిఎంఆర్ ప్రతినిధులు
హైదరాబాద్ నగరాన్ని, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రాంతంగా నిలబెట్టేందుకు దోహదం చేయగలవని భావిస్తున్న మరికొన్ని ప్రతిపాదనలను కూడా జిఎంఆర్ ప్రతినిధులు ప్రభుత్వానికి అందించారు.
మొక్కను నాటి నీళ్లు పోశారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మొక్కను నాటి నీళ్లు పోశారు. మొక్కలు నాటడాన్ని ఆయన ఓ కార్యక్రమంగా పెట్టుకున్నారు.
ఆర్థిక వ్యవస్థ బలోపేతం
ఇటు పెద్దసంఖ్యలో యువతకు ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కూడా ఈ ప్రతిపాదనలు ఉపయోగపడతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు భావిస్తున్నారు.
హైదరాబాద్ ముఖ చిత్రం మారుతుంది...
ఈ ప్రతిపాదనల తాలూకు నిర్మాణాలు పూర్తయిన అనంతరం హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోతుందని, అంతర్జాతీయ నగరాల చిత్రపటంలో మొదటి వరుసలో నిలుస్తుందని కెసిఆర్తో సహా అన్ని వర్గాలవారు భావిస్తున్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఈ నిర్మాణాలు ఉపయోగపడతాయని జీఎంఆర్ సంస్థ వ్యాఖ్యానించింది.
కెసిఆర్తో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో శుక్రవారం సచివాలయంలో భేటీ అయిన సందర్భంగా జీఎంఆర్ గ్రూపు అధినేత గ్రంధి మల్లికార్జున్రావు తమ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచారు.
హైదరాబాద్పై కేంద్రీకరణ
ప్రత్యేకించి గ్లోబల్ నెట్వర్కింగ్ డెస్టినేషన్, హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయడం, స్మార్ట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతర్జాతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడం, పర్యాటకరంగాన్ని అభివృద్ధిపరచడం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎమ్యూజ్మెంట్ పార్కు, వైద్య పర్యాటకం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల సర్వీస్ సెంటర్ ఏర్పాటు తదితర అంశాలు కూడా తమ ప్రెజెంటేషన్లో జీఎంఆర్ అధినేతలు పొందుపరచారు. ప్రత్యేకించి ఈ ప్రాజెక్టుల నిర్మాణానికిగాను అత్యంత అనువైన ప్రదేశంగా దక్షిణ హైదరాబాద్ను అభివర్ణించారు.
హైదరాబాద్ విమానాశ్రయం
ఇప్పటికే తమ గ్రూపు ఆధ్వర్యంలో నడుస్తున్న శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా లక్ష మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతోందని, ఇదే క్రమంలో మరింత నాణ్యమైన సేవలనందించే దిశగా విమానాశ్రయాన్ని క్రమేపీ అభివృద్ధి చేస్తూ వస్తున్నామని జిఎంఆర్ ప్రతినిధులు తెలిపారు.
50 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్
శంషాబాద్ విమానాశ్రయం ఇప్పటికే ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి జిఎంఆర్ ప్రతినిధులు తీసుకువచ్చారు. మొత్తం 50 ఎకరాల్లో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ను లక్ష చదరపు మీటర్ల పరిధిలో నిర్మిస్తామని చెప్పారు.
కెసిఆర్ సానుకూలం
మొత్తం రూ.750కోట్ల మేరకు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకుగాను ప్రభుత్వ సాయాన్ని కూడా జీఎంఆర్ సంస్థ కోరింది. జీఎంఆర్ గ్రూపు ప్రతిపాదనల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇతర రాష్ట్రాలకన్నా కనీసం 10 శాతం తక్కువగా ఉండేలా పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు.
తక్కువ పన్నుల విధానం
అవినీతిరహిత పారిశ్రామిక విధానం, అనుమతుల మంజూరు సరళీకృతం తదితర విధానాలను ఇప్పటికే ప్రకటించిన సీఎం... తాజాగా ‘తక్కువ పన్నుల విధానం'పై ఆమోదాన్ని తెలిపారు.
మరో విమానాశ్రయం
జీఎంఆర్ గ్రూపు చేసిన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్కు ఉత్తర దిశగా మరో విమానాశ్రయాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిందిగా జీఎంఆర్ సూచనలను కోరారు. దీంతోపాటు ప్రపంచస్థాయి థీమ్పార్కు నిర్మాణం, శంషాబాద్ విమానాశ్రయంవద్ద అత్యుత్తమైన ఆస్పత్రి నిర్మాణాల విషయమై కూడా పరిశీలించాలని సూచించారు.
సమావేశంలో వీరంతా..
రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్శర్మ, జీఎంఆర్ గ్రూపు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్జీకే కిషోర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.