వీర్రాజు చిచ్చు: కంగారెత్తిన చంద్రబాబు, మోడీకి ఫోన్
Recommended Video
అమరావతి: బిజెపి నేత సోము వీర్రాజు రగిల్చిన చిచ్చు బిజెపి, తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం పెంచే ప్రమాదాన్ని పసిగట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమైనట్లు కనిపిస్తున్నారు.
సోము వీర్రాజు వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్సీ వైబీ రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా ధ్వజమెత్తడంతో చంద్రబాబు చిక్కుల్లో పడినట్లు కనిపించారు. దాంతో కంగారెత్తిన చంద్రబాబు నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు
పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు...
గుజరాత్ ఎన్నికల ఫలితాల కేంద్రంగా టిడిపి, బిజెపి మధ్య రగిలిన చిచ్చును ఆర్పేందుకు చంద్రబాబు జాప్యం చేయకుండా నడుం బిగించారు. ఎమ్మెల్సీ వైబీ రాజేంద్రప్రసాద్-బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసుకున్న పర్సపర విమర్శలపై, సవాళ్లూ ప్రతిసవాళ్లపై విదేశీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఆరా తీశారు. పార్టీ నేతలెవరూ బీజేపీపై విమర్శలు చేయవద్దని, ఈ విషయాన్ని జిల్లా స్థాయి నేతల వరకూ స్పష్టం చేయాలని ఆయన ఆదేశించారు.
కాంగ్రెసు గెలవాలని ఎలా అనుకుంటాం..
గుజరాత్లో బీజేపీ విజయం సాధించడం అందరికీ సంతోషమేనని, సహజంగా ఆ పార్టీ నేతల్లో కూడా ఉత్సాహం ఉంటుందనే విషయాన్ని గ్రహించి స్పందించాలని చంద్రబాబు టిడిపి నేతలకు స్పష్టం చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలో ఉండాలన్నదే పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు.
అటు వైపు నుంచి ఎవరు మాట్లాడినా..
బిజెపి నుంచి ఎవరైనా మాట్లాడినా అది వారి విచక్షణకే వదిలేయాలని, మనం కూడా మాట్లాడి వాతావరణాన్ని చెడగొట్టడం సరికాదని, దాన్ని సహించబోనని చంద్రబాబు అన్నారు.. ఈ వ్యవహారంలో మనం ప్రత్యర్ధులకు అవకాశం ఇచ్చేలా వ్యవహరించరాదని సూచింారు.ఎమ్మెల్సీ వైబీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడినట్లు తెలిసింది.
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా..
పార్టీ ముఖ్య నేతలు, టీవీ చానెళ్ల చర్చకు వెళ్లే అధికార ప్రతినిధులు, సీనియర్లకు రాత్రి టెలీకాన్ఫరెన్సులో బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.. రెండు పార్టీలూ కలసి ఉండాలన్నదే తమ పార్టీ నిర్ణయమని, అమిత్షా-మోడీ, తన వ్యాఖ్యలకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని, ఇతరులు ఎవరు మాట్లాడినా దానికి విలువ ఉండదని ఆయన చెప్పారు. ఆ కోణంలోనే ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.
మోడీ ట్వీట్ చేసిన తర్వాత కూడానా..
నంద్యాల విజయం తర్వాత తెలుగుదేశం తమకు విలువైన మిత్రపక్షమని స్వయంగా మోడీ ట్వీట్ చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేస్తూ ఆ తర్వాత మిగిలిన వారి మాటలు పట్టించుకోవద్దని, రెండు పార్టీ నాయకత్వాల స్థాయిలో తీసుకునే నిర్ణయాలపై వారు మాత్రమే మాట్లాడతారని చెప్పారు.
రంగంలోకి దిగిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల్చిన తర్వాత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రంగంలో దిగారు. పొత్తులపై చంద్రబాబు, మోడీ-అమిత్షా మాట్లాడనప్పుడు సోము వీర్రాజు, రాజేంద్రప్రసాద్లకు పొత్తులతో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. తద్వారా వేడిని చల్లార్చే ప్రయత్నం చేశారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును తాము కోరుకున్నామే గానీ, కాంగ్రెస్ గెలవాలని మేమెందుకు కోరుకుంటామని అన్నారు. తద్వారా తాము బిజెపి వెంట ఉంటామనే సంకేతాలను ఇచ్చారు.
సోము వీర్రాజుకు సోమిరెడ్డి చురకలు
ప్రత్యేక హోదాను తెరపైకి తీసుకువస్తున్నారని సోము వీర్రాజు తమపై మాట్లాడుతున్నారని, అదే అంశాన్ని రోజూ మాట్లాడుతున్న జగన్ను ఎందుకు విమర్శించటం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగారు.
మోడీకి చంద్రబాబు ఫోన్...
చిచ్చును చల్లార్చాలనే ఉద్దేశంతోనే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చినందుకు ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షాకు చంద్రబాబు ఫోన్ చేసి వారిని అభినందించారు. దేశంలో ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతున్నారన్న విషయం స్పష్టమవుతోందని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.