60లక్షల ఖరీదైన లివర్ మార్పిడి ఆరోగ్యశ్రీతో ఉచితంగా.. బాలుడికి పునర్జన్మ!
తెలంగాణా రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ఎంతోమంది ప్రాణాలు నిలుపుతుంది. చాలా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఎంతో మంది జీవితాలలో వెలుగులు నిపుతుంది ఆరోగ్యశ్రీ పథకం. తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు 18 నెలల బాలుడికి విజయవంతంగా కాలేయ మార్పిడి చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు.
బాలుడికి లివర్ మార్పిడి ఆపరేషన్
పదికిలోల బరువున్న చిన్నారికి 240గ్రాముల లివర్ ను విజయవంతంగా అమర్చారు. కార్పోరేట్ ఆస్పత్రులలో 60 లక్షలు విలువ చేసే ఖరీదైన ఈ వైద్యాన్ని ఆరోగ్య శ్రీ ద్వారా అందించారు.హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఉడంగడ్డ ప్రాంతానికి చెందిన ఎండీ ఇర్ఫాన్, సాజియా దంపతుల కుమారుడు అయిన అఫాన్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. తరచూ స్పృహ కోల్పోతూ ఉండటంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యుల సలహా మేరకు అఫాన్ ను ఉస్మానియాకు తీసుకువెళ్ళారు.

ఉస్మానియా ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
ఇర్ఫాన్ వృత్తి రీత్యా ఫ్లవర్ డెకరేషన్ బాయ్ కావటంతో కుమారుడి వైద్యానికి ఆరోగ్య శ్రీని ఆశ్రయించారు. అఫాన్ కు కాలేయ వాపు ఉందని, దీనివలన అఫాన్ ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఉస్మానియా గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డా. మధుసూదన్ చెప్పారు. బాలుడికి లివర్ మార్పిడి చెయ్యాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 28వ తేదీన తండ్రి కాలేయం నుండి తీసుకున్న కొంత భాగాన్ని బాలుడికి అమర్చారు.
14 గంటలపాటు సర్జరీ చేసి లివర్ అమర్చిన వైద్యులు
దాదాపు 14 గంటలపాటు వైద్య బృందం నిరంతరాయంగా శ్రమించి సర్జరీ నిర్వహించింది. దేశంలోనే తొలిసారి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించినట్టు ఉస్మానియా గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి తెలిపారు. ప్రస్తుతం శస్త్రచికిత్స విజయవంతం కావటంతో బాలుడు కోలుకుంటున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా అరుదైన శస్త్ర చికిత్స చేసి బాలుడి ప్రాణాలు కాపాడిన వైద్య బృందాన్ని వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.
రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం.. ప్రభుత్వ లక్ష్యం అన్న మంత్రి
రాష్ట్రంలోని పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి దామోదర రాజ నరసింహ పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్స తమ ఆలోచనకు, నిబద్దతకు నిదర్శనం అన్నారు. ఆరోగ్య శ్రీ సేవలు ప్రాణాలు కాపాడుతుండటం సంతోషదాయకం అన్నారు.












Click it and Unblock the Notifications