నలుగురు టీడీపీ ఎంపీల ఫిరాయింపు చంద్రబాబు వ్యూహంలో భాగమన్న వైసీపీ ఆరోపణలపై మీ కామెంట్ ఏంటి?
Recommended Video
టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనమైంది. టీడీపీ రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరీ, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావ్ ఈ మేరకు చేసిన తీర్మానాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అంగీకరించారు. అనంతరం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన వెంకయ్యనాయుడుకు ఆ లేఖను అందజేశారు. అయితే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు చంద్రబాబు సూచనల మేరకు పక్కా వ్యూహంతో బీజేపీలో చేరారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఎన్నికల్లో పరాజయం.. మరోవైపు కేసుల భయం వెంటాడుతుండటంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సరికొత్త నాటకానికి తెరతీశారని వైసీపీ ఆరోపిస్తోంది. బీజేపీలోకి ఆ నలుగురిని తన కోవర్టులుగా పంపారని అంటోంది. బీజేపీలో చేరిన వారంతా చంద్రబాబుకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితులు కావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్లు వ్యాపార, ఆర్థిక వ్యవహారాల్లో చంద్రబాబుకు బినామీలన్న విమర్శలు ఉన్నాయి. 2010కి ముందు రాష్ట్రంలో వారి గురించి ఎవరికీ అంతగా తెలియదు. మరోవైపు గరికపాటి మోహన్రావు చంద్రబాబు రాజకీయ వ్యవహారాలు చూసుకుంటారు. ఇక లోకేశ్ కారణంగానే టీజీ వెంకటేశ్కు రాజ్యసభ సీటు దక్కిందన్న వార్తలు వచ్చాయి. బీజేపీలో చేరిన ఆ నలుగురు ఎంపీలు వ్యాపారవేత్తలు. ఈ నేపథ్యంలో వారి వ్యాపార ప్రయోజనాలు, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో కొందరు ఆర్థిక నేరాల కేసుల్లో ఇబ్బందులు ఎదురవకుండా ముందస్తు వ్యూహంలో భాగంగానే చంద్రబాబు వారిని బీజేపీలోకి పంపాడని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. తాను విదేశీ పర్యటనలో ఉండగానే ఈ వ్యవహారాన్ని చక్కబెట్టాలన్న చంద్రబాబు సూచనల మేరకే నలుగురు రాజ్యసభ సభ్యులు ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీ తనలో చేరుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. ఆ పార్టీకి లోక్సభలో భారీ మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో సంఖ్యాబలం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసింది. 245మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీయేకు కేవలం 102 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో బీజేపీ సభ్యులు 71మంది. రాజ్యసభకు ఎన్నికలు జరిగితే ఏడాది మరో నలుగురు సభ్యులు పెరిగే ఛాన్సుంది. ఫలితంగా బీజేపీ బలం 75, ఎన్డీయే సంఖ్య 106కు చేరుతుంది. సభలో మెజార్టీ మార్క్ 123 కావడంతో కీలక బిల్లులకు సభ ఆమోదముద్ర వేయించుకునేందుకు బీజేపీకి ఇతర పార్టీల ఎంపీల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో బీజేపీ సైతం సంఖ్యాబలం కోసం నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను పార్టీలో విలీనం చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనం కావడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందన్న వైసీపీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.