విస్తుపోయిన సీఎం చంద్రబాబు: దుర్గగుడిలో స్పెషల్ పూజలు నిజమే.. ఈఓ సూర్యాకుమారే కీలకం
అమరావతి: దుర్గగుడిలో అర్ధరాత్రి అపచారం జరిగిందని తేలడంతో విస్తూ పోవడం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వంతైంది. ఇంత జరుగుతుంటే దేవాదాయ శాఖాధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దుర్గగుడిలోకి బయటి వ్యక్తులు ఎలా రాగలిగారని, ఇది పూర్తి స్థాయి పాలనా వైఫల్యమేనని ఆయన అన్నట్లు తెలిసింది.
దుర్గగుడి ఈవో సూర్యకుమారి ప్రమేయంతోనే ఈ వ్యవహారం జరిగిందని పోలీసులు నివేదికలో పేర్కొనడంతో వెంటనే ఆమెను అక్కడి నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఇక్కడే ఇలా జరుగుతోందా? రాష్ట్రంలో ఇతర ఆలయాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయేమో పరిశోధించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

వేళకాని వేళలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నిర్దారణ
శనివారం రాత్రి శనివారం రాత్రి దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కమిషనర్ అనురాధ పోలీసులతోపాటు సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లారు. వారితోపాటు విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, విజయవాడ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. దేవాదాయశాఖ నివేదికలోనూ అసంబద్ధ ఘటనలు జరిగిన విషయం వాస్తవమేనని నివేదించినట్లు తెలిసింది. దీనికి బాధ్యురాలిగా గుర్తిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యకుమారిని వెంటనే విధుల నుంచి తప్పించారు. దేవాదాయశాఖ కమిషనర్ అనురాధకు దుర్గ గుడి బాధ్యతలు అప్పగించారు. వేళకాని వేళల్లో కొన్ని పూజలు జరిగినట్లుగా తేల్చినట్లు సమాచారం. ఆలయంలో శుద్ధి చేయడంతోపాటు ప్రత్యేక పూజలూ నిర్వహించారని వెల్లడైంది. మహిషాసుర మర్దిని అలంకారమూ చేశారని స్పష్టమైంది.

సులభంగా ఇతరులు దుర్గగుడిలోకి ప్రవేశించారని పోలీసు నివేదిక
ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉన్నతాధికారులకు తెలిసే దుర్గాదేవికి పూజలు జరిగినట్లు పోలీసు విచారణలో తేలింది. గుడివద్ద రక్షణ చర్యలను ఇది ప్రశ్నార్థకం చేసిందని సీఎం చంద్రబాబుకు పోలీసులిచ్చిన నివేదిక పేర్కొంది. బయటి వ్యక్తులు అత్యంత సులభంగా దేవాలయంలోకి ప్రవేశించగలిగారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తరహా పూజలు, ఎందుకోసం చేశారనేదానిపై మరింత లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దుర్గ గుడిలో అర్ధరాత్రి పూజలపై నిజనిర్ధారణ కమిటీతో పాటు పోలీసులు సమాంతరంగా విచారణ నిర్వహించిన విషయం తెలిసిందే. డీసీపీ కాంతిరాణా టాటా ఆధ్వర్యంలో ఏసీపీ, సీఐ ఇతర అధికారులు విచారణ జరిపారు. దాదాపు 20మందిని వారు విచారించారు. వీరిలో ముగ్గురు పూజలు చేసినట్లు అంగీకరించారు. వారి వాంగ్మూలం నమోదు చేశారు.

వివరాలు వెల్లడించడానికి నిరాకరించిన విజయవాడ సీపీ గౌతం సవాంత్
దాదాపు 10మంది సాక్షుల వాంగ్మూలాల నమోదుతో నివేదికను సీఎం చంద్రబాబుకు విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ అందజేశారు. నివేదికలోని అంశాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. కోడూరు మండలం విశ్వనాథపల్లి శివాలయానికి చెందిన పూజారి పార్థసారధి అలియాస్ రాజాను మొదట పోలీసులు విచారించారు. ముందు రోజు సమాచారం ఇచ్చి తమను పిలిపించారని, డిసెంబర్ 26 రాత్రి ఆలయాన్ని శుద్ధిచేసి అలంకరించామని ఆయన చెప్పారు. అతడిచ్చిన సమాచారంతో గుంటూరు జిల్లా వాసి సుజన్ను పోలీసులు విచారించారు. అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరణ చేసి పూజలు చేశామని, తర్వాత ఆ అలంకారం తీసి సాధారణ అలంకారం చేశామని సుజన్ చెప్పారు.

లోపలేం జరిగిందో తెలియదన్న దుర్గాగుడి పరిచారకులు
ఈ సందర్భంగా అమ్మవారి కవచం తొలగించినట్లు సుజన్, తదితరులు అంగీకరించారు. అలంకరణ కుదరకపోవడంతో మరుసటి రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య దర్శనం నిలిపివేసి మళ్లీ సరిచేసినట్లు సుజన్ తెలిపారు. శుద్ధి చేసి అలంకరణ చేశామని ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ బాబు విచారణలో అంగీకరించారు. పూజలు చేయలేదని చెప్పారు. ఈవో సూర్యా కుమారి దగ్గర అనుమతి తీసుకునే శుద్ధి చేశామని ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ బాబు తెలిపారు. శుద్ధికి సహాయకులుగా ఉండాల్సిన పరిచారకులనూ పోలీసులు పిలిచి విచారించారు. సాధారణంగా తామే శుద్ధి చేస్తామని, ఆ రోజున తమను బయటే ఉండమన్నారని పరిచారకులు వాంగ్మూలం ఇచ్చారు. లోపల ఏం జరిగిందో తమకు తెలియదని చెప్పారు. సీసీ టీవీ పుటేజీలనూ పోలీసులు పరిశీలించారు.

రాత్రి 12.30లకు బయటకు వెళ్లారని కానిస్టేబుల్ వాంగ్మూలం
సీసీటీవీ పుటేజీల్లో క్యూలైన్ ఇన్స్పెక్టర్ మధు అందులో ఉన్నట్లు కనిపించడంతో ఆయననూ పోలీసులు విచారించారు. ఆ సమయంలో తమను బయటకు పంపారని ఆయనా చెప్పారు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వాంగ్మూలాన్నీ నమోదు చేశారు. ప్రధాన అర్చకుడు తమను బయటే ఉంచారని, లోపల ఏం జరిగిందో తెలియదని ఆయన చెప్పారు. రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ను విచారించగా ప్రధాన అర్చకుడు, ఇతరులు రాత్రి 12.30 గంటలకు వెళ్లినట్లు తెలిపారు. స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులనూ పోలీసులు విచారించారు. సాధారణంగా అలంకరణ గురువారం చేస్తారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 10.30 గంటలకు పూర్తి చేస్తారని వివరించారు. కానీ జాప్యం ఎందుకు జరిగిందో తెలియదని చెప్పారు. ప్రధానార్చకుడు, ఇతర పూజారుల కాల్డేటాను పోలీసులు విశ్లేషించినట్లు తెలిసింది. ఆ సమయంలో ఉన్నతాధికారికి కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. ఏం పూజలు చేశారనే దానిపై మాత్రం పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. దుర్గ గుడిలో అనధికారికంగా కొందరు పూజారులు రాత్రిపూట ప్రవేశించారని విచారణలో తేలిందే తప్ప ఎలాంటి పూజలు చేసినట్లుగా ఇప్పటివరకూ తేలలేదని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. మరింత లోతైన దర్యాప్తు చేసి అన్నీ తేలుస్తామని వివరించారు.

ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించి మరీ ఏర్పాట్లు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో గతేడాది డిసెంబర్ 26న అర్ధరాత్రి బద్రీనాథ్తోపాటు మరో ముగ్గురు అనధికార పూజారులు పూజలు చేయడం వెనుక ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యకుమారే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలిందని అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం. మహిషాసుర మర్దిని రూపానికే పూజలు నిర్వహించేలా ఆమె నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఆలయ ప్రధాన పూజారి బద్రీనాథ్ బంధువుగా పేర్కొనే పార్థసారథి ఇంతకుముందు దుర్గగుడి పూజల్లో పాల్గొనేవాడని చెబుతున్నా అతడు కేవలం మహిషాసుర మర్దిని అలంకారం నాడే పాల్గొనేవాడని చెబుతున్నారు. అలంకారం చేశాక ఫోటో తీసి ఫోన్లో తనకు పంపాల్సిందిగా ఈవో సూచించినట్లు సమాచారం. ఆ ఫోటోను తాను ఎవరికో పంపాల్సి ఉందని చెప్పినట్లుగా పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఫోటోను ఆమె ఎవరికి పంపదలచుకున్నారు? ఈ వ్యవహారం వెనుక ఈవోతోపాటు ఇంకా వేరేవారి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేయనున్నారు. పూజలో ఉన్న సమయంలో పూజారులు ఈవోతో ఫోన్లో మాట్లాడిన అంశాన్నీ పోలీసులు గుర్తించారు. దాదాపు 4 నిమిషాల కొన్ని సెకన్ల పాటు వారు ఫోన్లో మాట్లాడుకున్నారు. కేవలం వివరాలేనా? లేక ఆ సమయంలో పూజా క్రమాన్ని ఆమెకు వినిపించేందుకు ఇలా చేశారా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఇబ్బందులు తలెత్తకుండా ముందే ఏర్పాట్లు ఇలా
పూజకు కావాల్సిన మరికొన్ని వస్తువులను భవానీపురంలో తీసుకున్నారని, వాటిని బద్రీనాథ్ ఏర్పాటు చేశారని సమాచారం. ఆలయంలో రాత్రి విధుల్లో ఉండే సిబ్బందికి, మరికొందరికి ఈవో ముందే సూచనలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి ఆలయంలో శుద్ధి చేయడానికి కొందరు వస్తారని చెప్పి.. ఎవరి నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసినట్లు సమాచారం. దీంతో మిగిలినవారు ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మహిషాసుర మర్దిని అలంకారం తర్వాత రాజరాజేశ్వరి అలంకారం చేసేందుకు పామర్రు నుంచి చెరకుగడ తెచ్చినట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఇద్దరు అదే రోజు రాత్రి రాత్రి విజయవాడ ఆర్టీసీ బస్టాండులోని డార్మెటరీలో నిద్రించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో వారు మద్యం తెచ్చుకుని సేవించినట్లు తెలిసింది.

సంప్రదాయ విరుద్ధంగా కార్యక్రమాలు జరిగాయన్న పోలీసు ఉన్నతాధికారి
ఆలయ ప్రధానార్చకుడు బద్రీనాథ్ ఎప్పటి నుంచో తన బంధువుకు ఆలయంలో ఉద్యోగం ఇప్పించాలని ఈవో సూర్యకుమారిని కోరుతున్నారని, ఈ పూజ చేయించే క్రమంలో ఈవో ప్రధాన అర్చకుడికి ఆ ఉద్యోగం ఆశ చూపించి ఈ పని చేయించినట్లుగా దర్యాప్తులో వెలుగు చూసినట్లు సమాచారం. దీనిపై ఒక పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ ‘అగంతకులు ఆలయంలోకి ప్రవేశించిన మాట వాస్తవం. సంప్రదాయ విరుద్ధంగా ఆలయంలో కొన్ని కార్యక్రమాలు జరిగాయని తేలింది' అని పేర్కొన్నారు. గమ్మత్తేమిటంటే ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్ ఉజ్వలంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ సాక్షాత్ దుర్గాగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు విపక్షాలు ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించడంతో అధికార పక్షంలో ఆత్మరక్షణలో పడటం గమనార్హం.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications