రసకందాయంలో కశ్మీర్ సంకీర్ణం: బిజెపి వ్యూహం ఇదీ...
జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో అధికార పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ 28, దాని మిత్ర పక్షం బీజేపీకి 25, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 15, కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా,
న్యూఢిల్లీ/ శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో ప్రభుత్వానికి సారథ్యం వహించాలన్నది బీజేపీ సుదీర్ఘ కాలం కల. ఆ దిశగా పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో ఉన్న స్నేహాన్ని తొలిమెట్టుగా వినియోగించుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు.
అందుకే తాజాగా ఆరునెలలకు ఒకసారి రొటేషనల్ సీఎం ప్రతిపాదనను జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీతో బీజేపీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నదని తెలుస్తున్నది.
ఒకవైపు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శ్రీనగర్లో జరుగుతుండగా జమ్ముకశ్మీర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.. ఒక టీవీ చానెల్తో మాట్లాడుతూ 'రొటేషనల్ సీఎం' పదవి ప్రతిపాదనను బయటపెట్టారు.
సమయానుకూలంగా నిర్ణయిస్తామన్న జితేంద్ర సింగ్
రొటేషనల్ సీఎం అభ్యర్థిత్వంపై బీజేపీ జాతీయ నాయకత్వం అంతర్గతంగా చర్చించినట్లు జితేంద్ర సింగ్ సంకేతాలిచ్చారు. కానీ దీనిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. తమది ఒక సంస్థాగతమైన పార్టీ అని, కిచెన్ కోటరీ కాదని, ఉన్నతస్థాయిలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నిరంతరం ఉగ్రవాదం, హింసతో జమ్ము, లడక్ ప్రాంతాలతోపాటు కాశ్మీర్ ప్రజలు కష్ట పడరాదన్నదే తన అభిమతం అని కూడా జితేంద్ర సింగ్ తెలిపారు. పార్టీ నాయకత్వం సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నదని చెప్పారు.
రొటేషన్ సీఎం పదవికి పీడీపీ నో
తమ పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా పెడితేనే జమ్ముకశ్మీర్లోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయంట. ఈ మేరకు ఈ విషయాన్ని ఇప్పటికే హైకమాండ్ స్థాయిలో చర్చ కూడా చేసినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్లో పీడీపీ - బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరిస్థితులకు తగినట్లుగా ముఖ్యమంత్రిని మార్చే విధానం తీసుకొస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ఇటీవల సీఎం మెహబూబా ముఫ్తీతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు చర్చించారని తెలుస్తున్నది. అయితే రొటేషనల్ సీఎం ప్రతిపాదనను ఆమె తిరస్కరించారని తెలుస్తోంది.
రసపట్టులో కశ్మీర్ సంకీర్ణం
కానీ ఇటువంటి చర్చే కేంద్ర ప్రభుత్వంతో జరుపలేదని మెహబూబా ముఫ్తీ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితులు, కల్లోలిత పరిస్థితులు అదుపులోకి రావాలంటే ఖచ్చితంగా తమ పార్టీ నేతనే సీఎంగా పెడితేనే బాగుంటుందని బీజేపీ ఉన్నత శ్రేణి నాయకులు, మెహబూబా ముఫ్తీతో తేల్చి చెప్పినట్లు సమాచారం. 2018లో సగం పదవీ కాలం ముగిసే సమయానికి సీఎం పదవిని తమకు అప్పగించాలని కమలనాథులు కోరుతున్నట్లు తెలుస్తున్నది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) వ్యవస్థాపకుడు ముఫ్తీ మహ్మద్ సయీద్తో మాత్రమే ఆరేండ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వం కొనసాగించాలని నిర్ణయించామని, ఆయన కూతురుతో కాదని బీజేపీ సీనియర్ నేతలు అనధికారిక చర్చల్లో తేల్చేస్తున్నారు.
కాంగ్రెస్ అనుభవాన్నిగుర్తుచేస్తున్న పీడీపీ
జమ్ముకశ్మీర్ సీఎంగా ముస్లింను కొనసాగించాలన్న సంప్రదాయానికి అనుగుణంగా సజ్జాద్ లోన్ అభ్యర్థిత్వాన్ని ముందుకు తేవాలని కమలనాథులు చెప్తున్నారు. కానీ జితేంద్రసింగ్ ఈ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపడం లేదు. మాట వరసకు కూడా పీడీపీ రొటేషనల్ సీఎం పదవికి అనుకూలంటా లేదు. గతంలోనూ కాంగ్రెస్ - పీడీపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఫ్తీ మహ్మద్ సయీద్ ను మూడేళ్ల తర్వాత గులాం నబీ ఆజాద్ కోసం తప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కానీ ఆరేళ్ల పాటు ముఫ్తీని సీఎంగా కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని పీడీపీ వర్గాలు భావించాయట. చివరి క్షణంలో నాటకీయంగా పూర్తిగా మారిపోతాయని పీడీపీకి గతానుభవమే. రెండు పార్టీల మధ్య స్నేహం పూర్తి కాలం కొనసాగదన్న సంకేతాలు వస్తే రొటేషనల్ సీఎం అభ్యర్థిత్వం ప్రతిపాదన తేవాలన్నది తమ వ్యూహంలో భాగమేనని బీజేపీ చెబుతోంది. కానీ తమ ప్రతిపాదనను మెహబూబా అంగీకరించకపోవడమే తమకు కావాలని బీజేపీ వాదిస్తున్నది.
బీజేపీతో పొత్తుపై కశ్మీరీల్లో ఆగ్రహం
పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) ప్రధాన అధికార ప్రతినిధి మెహబూబ్ బేగ్ మాట్లాడుతూ బీజేపీతో చర్చల్లో ఇటువంటి ప్రతిపాదన రాలేదన్నారు. తమ ద్రుష్టంతా కశ్మీర్ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడంపైనేనని పేర్కొన్నారు. గత ఏడాది బుర్హాన్ వనీ సంఘటన జరిగినప్పటి నుంచి సీఎం మెహబూబా ముఫ్తీ కశ్మీర్లో పరిస్థితులు నియంత్రించలేకపోతున్నారు. బీజేపీతో కలిసి తమ విశ్వాసాన్ని దెబ్బకొట్టారని కూడా ఆమెపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెహబూబా ముఫ్తీ వైఖరి ఇలా
దీనిపై జితేందర్ సింగ్ స్పందిస్తూ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కావాలని ఈ విధంగా విమర్శిస్తున్నారని, వారికి అధికారం వచ్చే అవకాశం రావొచ్చని ఆశపడే ఇలాంటి చర్యలకు దిగుతున్నారంటూ కొట్టి పారేశారు. అయితే, బీజేపీ సీఎం వస్తే ఈ పరిస్ధితులు సర్దుమణుగుతాయా అని మీడియా ప్రశ్నించగా తన నియోజకవర్గంలోని ప్రజలు మాత్రం ప్రస్తుత పరిస్థితిని అసలు ఏ మాత్రం ఇష్టపడటం లేదని చెప్పారు. మిలిటెంట్లు, హురియత్ కాన్ఫరెన్స్, జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) వంటి సంస్థల కార్యకలాపాల పట్ల మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి.
గవర్నర్ పాలన కోసం ఫరూఖ్ అబ్దుల్లా డిమాండ్
జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో అధికార పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ 28, దాని మిత్ర పక్షం బీజేపీకి 25, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 15, కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా, జమ్ము కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీకి రెండు, సీపీఎం ఒక స్థానంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణించిన తర్వాత చాలా కాలం పాటు రాష్ట్రంలో గవర్నర్ పాలన అమలులో ఉన్నా.. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతిపాదనను తోసిరాజని మెహబూబా బీజేపీతోనే కలిసి ముందుకు సాగారు. ఇరు పార్టీల నాయకత్వాలు స్వార్థ ప్రయోజనాలతో వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జమ్ముకశ్మీర్లో గవర్నర్ పాలన విధించడమే శ్రేయస్కరమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేస్తున్నారు.