కెసిఆర్ దారిలోనే చంద్రబాబు: కాపు కోటాపై దులుపేసుకోవడమే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హడావిడిగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి మంత్రివర్గ ఆమోద ముద్ర వేయించుకున్నారు.
బీసీ కెటగిరీలో ఎఫ్ అనే మరో కెటగిరీని చేర్చి కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి, దాన్ని రాజ్యాంగ సౌకర్యం కల్పించాలని కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది. అన్నీ తెలిసి కూడా చంద్రబాబు ఎందుకు ఆ పనిచేశారనేది చూడాల్సిన విషయమే.
Recommended Video
కెసిఆర్ ఇలా...
ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కెసిఆర్ ప్రభుత్వం కేంద్రంపైకి సమస్యను నెట్టేసింది. తమిళనాడులో మాదిరిగా రాజ్యాంగంలో చేర్చి అదనపు రిజర్వేషన్ల అమలుకు అవకాశం కల్పించాలని కెసిఆర్ కేంద్రాన్ని కోరారు. తమిళనాడులో ప్రస్తుతం 69 శాతం రిజర్వేషషన్లు అమలవుతున్నాయి.
యాబై శాతం మించకూడదని సుప్రీం...
రాజ్యాంగ నిబంధనల ప్రరకారం రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కూడా. రాజస్థాన్ ప్రభుత్వం గుర్జర్లకు రిజర్వేషన్లు కల్పించిన కేసులో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని స్పష్టం చేసింది. రాజస్థాన్లో రిజర్వేషన్ల కోటా ఇప్పటికే యాభై శాతం ఉందని, దాన్ని మరింత పెంచడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు నవంబర్లోనే తీర్పు చెప్పింది. అది తెలిసి కూడా చంద్రబాబు కాపులకు యాభై శాతం కోట వెలుపల రిజర్వేషన్లు కల్పించడానికి పూనుకున్నారు .
ఇలా చేయాలని తీర్మానం
ప్రస్తుతం బీసీల్లో ఏ నుంచి ఈ వరకు ఐదు వర్గాలున్నాయి. కొత్తగా బీసీ(ఎఫ్) కేటగిరీని ఏర్పాటు చేసి కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను చేరుస్తారు. వీరికి ఐదు శాతం కోటా ఇవ్వాలని తీర్మానించారు. విద్య, ఉద్యోగ, ఆర్ధికాంశాల్లోనే రిజర్వేషన్ వర్తిస్తుందని, రాజకీయ పదవులకు వర్తించదని తీర్మానంలో స్పష్టం చేశారు. కాపులకు అదనంగా రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు ఇవి...
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు 25 శాతం, ముస్లిం మైనారిటీల కిందకు వచ్చే కులాలకు 4 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి సరిగ్గా 50 శాతం అవుతున్నాయి. ఇప్పుడు కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలను ఎఫ్ గ్రూప్గా వర్గీకరించి వారికి అదనంగా ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మంత్రివర్గం తన తీర్మానంలో నిర్ణయించింది. దాంతో రిజర్వేన్లు 55 శాతానికి చేరుకుంటాయి. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా అవి అమలయ్యే అవకాశం లేదు.
తమిళనాడులో ఇలా కోటా...
తమిళనాడు రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో 69శాతం రిజర్వేషన్లు అమలవుతున్న అంశంపై నమోదైన కేసు విచారణ ఇప్పటికీ సాగుతోంది. తమిళనాడు తరహాలోనే రిజర్వేషన్లు అమలు చేయా లని తెలంగాణప్రభుత్వం కోరుతోంది. చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే పని చేసే అవకాశం ఉంది. అది రాష్ట్రపతి వద్దే ఆగిపోయే అవకాశం కూడా లేకపోలేదు.
ఇలా చేసినప్పటికీ...
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ శానససభ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. శాసనసభలో బిల్లు ఆమోదం పొందడం సులభమే. ప్రభుత్వానికి మెజారిటీ ఉంది కాబట్టి అది సాధ్యమవుతుంది. దాన్ని రాష్ట్రపతి ఆమోద కోసం పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదిస్తే ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్తుంది. పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్చాల్సి ఉంది. ఇది సాధ్యమయ్యే పని కాదని తెలంగాణ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల కల్పన విషయంలో తేలిపోయింది.
మంజునాథ కమిషన్ నివేదిక రాకుండానే...
కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో చంద్రబాబు హడావిడి చేసినట్ల కనిపిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై మంజునాథ కమిషన్ నివేదిక సమర్పించకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కల్పించే చర్యలను చేపట్టింది. అయితే, కమిషన్ మెజారిటీ సభ్యులు రిజర్వేషన్ల కల్పనకు అనుకూలంగా ఉన్నారనే కారణం చెప్పి శుక్రవారంనాడు మంత్రివర్గం ఆమోదించింది .
చంద్రబాబుకు ఇంత హడావిడి ఎందుకు...
ఓవైపు కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఆందోళనను ఉధృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన నిత్యం కుంపటి రగిలిస్తూనే ఉన్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సాగుతోంది. జగన్ పాదయాత్ర కాపులు అధికంగా ఉన్న జిల్లాల్లోకి చేరుకునే లోగానే కాపుల సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ముందడుగు వేసి ఉంటారని భావిస్తున్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల కెటగిరీ కూడా.....
దశాబ్దాలుగా ఉద్యమం చేస్తూ అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టుకున్నప్పటికీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. అది కూడా అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెసుకు ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీలను చీల్చడానికి చంద్రబాబు కారణంగానే వర్గీకరణ అంశం తెర మీదికి వచ్చి రగలుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి.
కెసిఆర్తో చంద్రబాబు జత కూడుతారా....
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగాలనే ఆలోచనలో కెసిఆర్ ఉన్నారు. కెసిఆర్కు తమిళనాడుకు చెందిన డిఎంకె నేత స్టాలిన్ ఇప్పటికే మద్దతు ప్రకటించారు. కాపుల రిజర్వేషన్ల విషయంంలో కెసిఆర్తో కలిసి చంద్రబాబు కూడా ఆందోళనకు దిగుతారా అనేది చూడాల్సి ఉంది.