కేజ్రీవాల్ విజయం ఎందుకంత సంచలనం?
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది కేవలం బిజెపి, కాంగ్రెసు పార్టీలను తుడిచిపెట్టడమే ఆ సంచలనానికి కారణమా, ఇంకేమైనా ఉందా అనేది పరిశీలించాల్సి ఉంది. ఒక్క రాష్ట్రంలో బిజెపి ఓడిపోవడం అనేది పెద్ద విషయం కాదు. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని ఆ మేరకే చూడడం లేదు. ఆ పార్టీ విజయం వెనక ఓ సామూహిక మానసిక పరిస్థితి ఒక్కటి పనిచేసింది. దేశంలో అప్రతిహతంగా విజయం సాధిస్తూ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ హవాను అది బద్దలు కొట్టింది. కాంగ్రెసు, బిజెపి వ్యతిరేక పార్టీలకు కేజ్రీవాల్ విజయం ఓ ఊరటను, ఆనందాన్ని కలిగించాయి. బిజెపిని ఓడించగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి.
మోడీని, ఆయన నాయకత్వంలోని ఓడించడం సాధ్యం కాదని అనుకుంటున్న సమయంలో కేజ్రీవాల్ అది సాధ్యమేనని నిరూపించారు. మోడీని ఓడించడం సాధ్యం కాదనేది తేలిపోయిందని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాటలు ఆ విషయాన్నే పట్టిస్తున్నాయి. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా బిజెపిని నిలువరించడం సాధ్యం కాదని, తాను బలంగా లేని ఎనిమిది రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అమిత్ షా పనిచేస్తున్నారని, ఇక దేశంలో బిజెపి తిరుగులేని శక్తిగా మారుతుందని, ఏకపార్టీ ఆధిపత్యం ఉనికిలో వస్తుందని అనుకుంటూ వస్తున్నారు. కానీ, అది అంత సులభం కాదని కేజ్రీవాల్ నిరూపించారు.
కాంగ్రెసు పార్టీ తిరిగి జవజీవాలు పొందడం కష్టమనే భావన కూడా ఇప్పటి వరకూ ఊంటూ వచ్చింది. అది కొంత మేరకు నిజం కూడా. కాంగ్రెసు పరిస్థితి వల్ల బిజెపికి ప్రత్యామ్నాయం లేదనే భావన బలంగా నాటుకుపోయి ఉంది. కేజ్రీవాల్ విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాలకు విస్తరించే అవకాశాలు ఉండడంతో పాటు, అవసరమైతే ఆ పార్టీతో కలిసి బిజెపిని ఎదుర్కోగలమని బిజెపి వ్యతిరేక పార్టీలు భావిస్తూ ఉండవచ్చు. వామపక్షాలకు మాత్రం అదే ఆశ ఉంది.
మధ్యతరగతి ప్రజలను, యువతను ఆమ్ ఆద్మీ పార్టీ తనవైపు తీప్పుకోవడం బిజెపికి పెద్ద దెబ్బ. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రదర్శించిన శక్తి, తాజాదనం, వినూత్నమైన ప్రచార సరళి అనుసరిస్తే బిజెపిని ఎదుర్కోవచ్చుననే విశ్వాసాన్ని బిజెపియేతర పార్టీలకు కలిగించింది. సమకాలీన సమస్యలను, ప్రజాదరణను ఆసరా చేసుకుని ముందుకు సాగితే విజయం వరిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నిరూపించింది.దానికి తోడు, ఆమ్ ఆద్మీ పార్టీ విజయం లౌకిక శక్తులు ఏకం కావడానికి దోహదం కూడా చేస్తుంది.
ఒక రకంగా, దేశంలోని బిజెపి వ్యతిరేక పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీ దారి చూపింది. కాంగ్రెసు రోజురోజుకీ కుదించుకుపోయే పరిస్థితి ఏర్పడిన తరుణంలో బిజెపిని ఎదుర్కునే శక్తులు బలహీన పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం బిజెపి వ్యతిరేక పార్టీలకు ఆత్మవిశ్వాసాన్ని ఢిల్లీ ఫలితాలు కలిగించాయి.