కొత్త సచివాలయం: ఎర్రగడ్డ నుంచి సికింద్రాబాద్కు?
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా నిర్మించదలచిన సచివాలయం స్థలానేష్వణ మరో కొత్త మలుపు తిరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచి ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని వికారాబాద్కు తరలించి, అక్కడ నిర్మించాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే సాంకేతికంగా కొన్ని ఇబ్బందులుండడంతో అందుకు ప్రత్యామ్నాయ స్ధలాలను వెతికే పనిలో పడింది.
ఛాతీ ఆసుపత్రి స్ధలం ఉన్న ప్రాంతానికి బేగంపేట విమానాశ్రయం అతి సమీపంలో ఉండటం, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇప్పటికీ బేగం పేట నుంచి విమానాలు రాకపోకలను సాగిస్తుండటంతో, బహుళ అంతస్థుల భవనాలు నిర్మంచడానికి కేంద్ర పౌరవిమాన శాఖ అభ్యంతరాలు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ప్రత్యామ్నాయ స్ధలాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా సికింద్రాబాద్లోని బైసన్ గ్రౌండ్, జింఖానా గ్రౌండ్లను పరిశీలిస్తున్నారు. వీటి విస్తీర్ణం సుమారు 70 ఎకరాలకుపైగా ఉంటుంది.
ఈ గ్రౌండ్లకు రెండువైపులా విశాలమైన రోడ్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడ సచివాలయాన్ని నిర్మిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ గ్రౌండ్లు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉన్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున త్వరలో సీఎం కేసీఆర్ కేంద్ర రక్షణ మంత్రిని కలిసే అవకాశం ఉంది.
కేంద్ర రక్షణ శాఖ ఇచ్చే స్థలాలకు ప్రత్యామ్నాయంగా వేరే చోట స్థలం ఇచ్చే యోజనలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ కేంద్ర రక్షణ శాఖ ఒప్పుకోని పక్షంలో ఛాతీ ఆసుపత్రిలోనే భారీ అంతస్తులు కాకుండా సాధారణ అంత్సతులతోనే సచివాలయాన్ని నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.