తనపై క్షుద్రపూజను లైట్గా కొట్టేసిన దినేష్ రెడ్డి
రాష్ట్రంలో ఎక్కడైనా ఆలయాలు, నివాస ప్రాంతాల్లో క్షుద్రపూజలు జరిగినపక్షంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఆయనపై ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి క్షుద్రపూజలు చేశారని వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ అటువంటి వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. నివాస ప్రాంతాల్లో అర్థరాత్రి వరకూ ఇలాంటి పూజలు చేయడం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాటిపై పోలీసులకు సమాచారమందిస్తే న్యూసెన్స్ కేసు పెడతామని హెచ్చరించారు.
హైదరాబాదులోని ప్రత్యంగిరిదేవీ ఆలయంలో క్షుద్రపూజలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆలయం ట్రస్టీ మల్లికార్జున రావుకు, పూజరి విఠల్ శర్మకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డిజిపి పదవి కోసం దినేష్ రెడ్డిపై సమరం సాగించిన ఐపియస్ అధికారి - దినేష్ రెడ్డి నాశనం కావాలని, ఆయనకు హాని కలగాలని ప్రార్థిస్తూ క్షుద్రపూజలు చేసినట్లు హైదరాబాదులోని ఎల్పీ నగర్లో కేసు నమోదైనట్లు వార్తలు వచ్చాయి.
హైదరాబాదులోని ఆర్కె పురంలో గల పత్యంగిరి పరమేశ్వరీదేవి ఆలయంలో ఉమేష్ కుమార్ క్షుద్రపూజలు నిర్వహించినట్లు కేసు నమోదైనట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షి సయ్యద్ నౌఫల్ అనే వ్యక్తి ధ్రువీకరించాడు. తాను క్షుద్రపూజలు చేయడం చూశానని అతను చెప్పాడు. మద్యం, మాంసంతో ఉమేష్ కుమార్ క్షుద్రపూజలు చేసినట్లు అతను తెలిపాడు.