బాబు ఆశయాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి దోస్తీ: కారణాలివే!
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు భిన్నంగా వెళ్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది!
సమస్యల విషయంలోనే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తున్నప్పటికీ.. అది అందరికీ కొంచెం కొత్తగా కనిపిస్తోంది. అలాగే, ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితా రెడ్డికి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది. వైసిపి కూడా మద్దతు పలికింది.
తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అనే విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో నిన్నటి వరకు, ఏపీలో ఇప్పటికీ టిడిపి.. కాంగ్రెస్, వైసిపిని బద్ధ శత్రువులుగా చూస్తోంది. అయితే, తెలంగాణలో మాత్రం రాజకీయ కారణాల వల్ల టిడిపి... కాంగ్రెస్ పార్టీతో కలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
రాంరెడ్డి వెంకట రెడ్డి మృతి నేపథ్యంలో పాలేరులో తమకు మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. గత సంప్రదాయాన్ని అనుసరించి తాము పాలేరులో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నామని తెలంగాణ టిడిపి, రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
ఇక, మహబూబ్ నగర్ జిల్లాలోని ఆర్డీఎస్ కోసం కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి కలిశారు. ఈ విషయమై తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరు పార్టీల నేతలు కెసిఆర్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు.
తాజాగా, ఆర్డీఎస్ కాల్వ తలుపుల వద్ద కాంగ్రెస్ పార్టీ నేత, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మహాదీక్ష తలపెట్టారు. ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం కనుగొంటామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో పాటు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, జైపాల్ రెడ్డి, వంశీచంద్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. టిడిపి నేత రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... కెసిఆర్ పాలన రావణాసురుడి పాలనలా ఉందని, దీనిని అంతం చేయాలంటే రాజకీయ పార్టీలు, జేఏసీలు అన్నీ సిద్ధాంతాలు, అజెండాలు పక్కన పెట్టి ఏకతాటి పైకి రావాలన్నారు. తెరాస అధికారంలోకి వస్తే ఆర్డీఎస్ వద్ద కూర్చీ వేసుకొని కూర్చుని పనులు పూర్తి చేయిస్తానని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఫాంహౌస్లో నిద్రపోతున్నారని ధ్వజమెత్తారు.
టిడిపి స్థాపించినప్పటి నుంచి సమైక్య రాష్ట్రంలో టిడిపి లేదా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఓ పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీ ప్రతిపక్షంలో ఉంది.
కానీ విభజన తర్వాత తెలంగాణలో తెరాస, కాంగ్రెస్, టిడిపి, బిజెపి, వామపక్షాలు తదితర పార్టీలు ఉన్నాయి. ఏపీలో వైసిపి, టిడిపి, కాంగ్రెస్, వామపక్షాలు, బిజెపి తదితర పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కలవడం గమనార్హం.
టిడిపి స్థాపించినప్పటి నుంచి సమైక్య రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో, కాంగ్రెస్ అధికారంలో ఉంటే టిడిపి ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి టిడిపి - కాంగ్రెస్ బద్ధ శత్రువులుగా మారాయి. పైగా టిడిపి స్థాపించిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా.
కానీ, ఇప్పుడు తెలంగాణలో తెరాస అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, టిడిపిలు కలవడం కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని సందర్భాలలో సమస్యల పైన విపక్షాలు ఏకతాటి పైకి రావడం సహజమే అంటున్నారు. గతంలో తెలంగాణ కోసం బీజేపీ, వామపక్షాలు కలవడం గుర్తు చేస్తున్నారు.య
ఏపీలో టిడిపి అధికారంలో ఉంది. అక్కడ వైసిపితో పాటు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి బద్ధ శత్రువు. అలాంటి పార్టీతో తెలంగాణ టిడిపి కలవడం ఆసక్తిని రేపుతోంది. ఇక, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నేతలు, కార్యకర్తలు కరువయ్యారని, అందుకే రేవంత్ కాంగ్రెస్తో జత కలుస్తున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి.