అది గుర్తుందా, సర్లే కానీ: 500వ టెస్ట్.. కోహ్లీ అసహనం
కాన్పూర్: కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య 500వ టెస్ట్ మ్యాచ్ గురువారం నాడు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొదటిసారిగా స్పైడర్ కామ్ను వినియోగించనున్నారు.
ఈ సందర్భంగా స్పైడర్ కామ్ల పైన భారత టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయాన్ని కోరగా కొంత అసహనం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసుకు వచ్చిన స్పైడర్ కామ్ కాన్సెప్ట్ క్రికెట్ నిబంధనలకు ఆటంకం కలిగించకూడదన్నాడు.
అయితే, స్పైడర్ కామ్ను ఓవర్ల మధ్య గానీ, ఒక బాల్ ముగిసిన తర్వాత గానీ వినియోగిస్తే బాగుంటుందన్నాడు. ఈ సందర్భంగా ఈ ఏడాది మొదట్లో సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన ఐదో వన్డే మ్యాచ్లో జరిగిన సంఘటనను కోహ్లీ ప్రస్తావించాడు.
తాను కొట్టిన బంతి బౌండరీకి వెళ్లిందని, కానీ స్పైడర్ కామ్ను తాకడం వల్ల అంపైర్ డెడ్ బాల్గా ప్రకటించాడని గుర్తు చేశాడు. ఆ సమయంలో తాను చాలా నిరుత్సాహపడ్డానన్నాడు. మ్యాచ్ ఉత్కంఠగా సాగే సమయంలో ఇటువంటి పరిణామాలను తాను ఇష్టపడనని చెప్పాడు. నాడు స్పైడర్ కామ్కు తాగి, డెడ్ బాల్గా ప్రకటించడంపై ధోనీ కూడా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.