బాబుకు 'తలసాని' చిక్కులు: జగన్కు అస్త్రం, పవన్ కల్యాణ్ ఎలా...
జగన్ పార్టీ నుంచి టిడిపిలో చేరిన కొద్ది మందికి చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు తలసాని చిక్కులు ఎదురవుతున్నాయి....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారం గుబులు పుట్టిస్తున్నట్లే ఉంది. మంత్రివర్గ విస్తరణ కోసం కసరత్తు చేస్తున్న ఆయనకు తలసాని వ్యవహారం పీటముడి వేసినట్లు భావించాల్సి ఉంది. చట్టపరమైన చిక్కులు ఏమిటనేది పక్కన పెడితే అది నైతిక సమస్యను మాత్రం సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
తమ పదవులకు రాజీనామా చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిలో అందరికీ సాధ్యం కాదు గానీ కొద్ది మందికైనా మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన అనివార్యతలో చంద్రబాబు ఉన్నారు. అదే ఇప్పుడు చంద్రబాబుకు సమస్యగా మారింది.
తలసాని విషయం ఏమిటి, ఏం జరిగింది...
తెలంగాణ రాష్ట్రంలోని సనత్నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్, తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరి కెసిఆర్ మంత్రివర్గంలో చేరారు. దానికంటే ముందు ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను స్పీకర్కు అందించారు. అయితే, ఆయన నిజంగానే రాజీనామా లేఖలు ఇచ్చారా, లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
గవర్నర్పై టిడిపి ఇలా....
తలసాని శ్రీనివాస్ యాదవ్తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ నర్సింహన్ను టిడిపి నాయకులు తప్పు పట్టారు. గవర్నర్ రాజ్యాంగ ధర్మాన్ని నెరవేర్చకుండా, ప్రభుత్వం చెప్పిన మాట విన్నారని విమర్సలు చేశారు. వేరే పార్టీ ఎమ్మెల్యేతో ఏవిధంగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తారని అడిగారు. అయితే, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికీ మంత్రివర్గంలో కొనసాగుతూనే ఉన్నారు.
చంద్రబాబు కూడా ఇలా...
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కూడా తలసానిని మంత్రివర్గంలో చేర్చుకోవడం అనైతికమని అన్నారు. తాము టికెట్టిస్తే గెలిచిన తలసానికి తెరాస మంత్రి పదవి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. టిడిపి నేతలు ఇప్పటికీ తలసాని వ్యవహారాన్ని తప్పు పడుతూనే ఉన్నారు.
చంద్రబాబు జాబితాలో వీరు ఉన్నట్లు....
ఏప్రిల్ 2వ తేదీ ఆదివారంనాడు మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్న చంద్రబాబుకు అటువంటి నైతిక సమస్యనే ఎదురవుతోంది., 21మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే టిడిపిలో చేరారు. వారిలో భూమా అఖిలప్రియ, అమర్నాథ్రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, జ్యోతుల నెహ్రులకు మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్తో పాటు ప్రతిపక్షాలు...
వైసిపి నుంచి వారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే జగన్తోపాటు కాంగ్రెసు వంటి ఇతర పార్టీలు కూడా విమర్శలు కురిపించే అవకాశం ఉంది. ప్రజల నుంచి నైతిక విలువలకు సంబంధించి వచ్చే విమర్శలు, చర్చల గురించి టిడిపి నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. హామీ మేరకు ఓవైపు వారికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా, మరోవైపు తాము తెలంగాణలో తలసానితో రాజీనామా చేయించకుండానే మంత్రి ఇవ్వడాన్ని అనైతిక చర్యగా గవర్నర్ను విమర్శించి, ఇప్పుడు ఏపీలో తామూ అదే పనిచేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారనే చిక్కులను ఎదుర్కొంటోంది. నైతిక విలువల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు తాను అదే అనైతిక చర్యలకు పాల్పడితే సమస్య ఎదురవుతోంది.
పవన్ కల్యాణ్ స్పందిస్తారా....
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టికెట్ మీద గెలిచి టిడిపిలో చేరిన శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారనేది కూడా చూసుకోవాల్సిన స్థితిలో చంద్రబాబు పడినట్లు చెబుతున్నారు. జగన్ చేసే విమర్శలను ఏదో రకంగా ఎదుర్కోగలమని అనుకున్నా పవన్ కల్యాణ్ కూడా విమర్శలకు దిగితే సమస్య అవుతుందని అంటున్నారు. జగన్తో పాటు పవన్ కల్యాణ్ కూడా విమర్శలకు దిగితే అది ప్రజల్లోకి వెళ్లి తటస్థులు దూరమైతే ప్రమాదకరమని కూడా భావిస్తు్నారు.
అలాగే చేస్తారా...
కెసిఆర్ వ్యూహాన్నే చంద్రబాబు కూడా వారి విషయంలో అనుసరిస్తారా అనేది చూడాల్సి ఉంది. తాను మంత్రివర్గంలోకి చేర్చుకోవాలని అనుకుంటున్న వారితో స్పీకర్కు రాజీనామా లేఖలు ఇప్పించి, వాటి ఆమోదం లభించకుండా ఉండే వ్యూహాన్ని అనుసరిస్తారా అనేది చూడాల్సిందే. తాము వద్దన్నా తలసానితో గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు.