తేల్చేశారు: పవన్ కల్యాణ్ రాజకీయాలపై త్రివిక్రమ్ టచ్
హైదరాబాద్: పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ చేసిన ఓ వ్యాఖ్య అందరి దృష్టి నుంచి తప్పిపోయినట్లు ఉంది. అందులోని ఆంతర్యాన్ని కూడా ఎవరూ గుర్తించినట్లు లేదు.
పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం రాత్రి హైదరాబాదులో జరిగింది. దీనికి పెద్ద యెత్తున పవన్ కల్యాణ్ అభిమానులు తరలి వచ్చారు. వారి కేరింతల మధ్య పవన్ కల్యాణ్తో తనకు గల అనుబంధాన్ని త్రివిక్రమ్ వివరించారు.
త్రివిక్రమ్ మాటల్లోని ఆంతర్యం..
పవన్ కల్యాణ్తో కలసి పనిచేసే రోజులు మరిన్ని రావాలని కోరుకుంటున్నానని త్రివిక్రమ్ అంటూ దానికి పొడగింపు ఇచ్చారు. సినిమాల పరంగా.. సినిమాల పరంగా అని రెండు సార్లు ఆ మాటలను ఒత్తి పలికారు. రాజకీయాల్లో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని అనుకుంటారేమోనని త్రివిక్రమ్ ఆ పదాన్ని ఒత్తి పలికినట్లు అనిపిస్తోంది. దీన్నిబట్టి పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఆయన దూరంగా ఉండదలుచుకున్నట్లు అర్థమవుతోంది.
Recommended Video
ఇలా కూడా అన్నారు..
పవన్ కల్యాణ్తో కలిసి ప్రయాణించే రోజులు మరిన్ని రావాలని, సినిమాలపరంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీరంతా కోరుకునేలా ఉన్నతమైన స్థాయికి ఆయన వెళ్లాలని మనస్ఫూర్తిగా మన అందరి తరుపున ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నానని త్రివిక్రమ్ అన్నారు. అంటే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆయన అన్నట్లు ప్రచారం సాగుతోంంది.
సినిమా ద్వారా
చిన్నప్పటి నుంచి సమాజానికి సేవ చేయాలని ఉండేదని, కానీ సినిమా ద్వారా సమాజానికి సేవ చేసేందుకు చాలా అదృష్టమని, సినిమా ద్వారా సమాజానికి సేవ చేసేలా జనసేన పార్టీని ప్రారంభించే అవకాశం లభించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ రకంగా కొద్దిగా మాత్రమే కార్యక్రమానికి పవన్ కల్యాణ్ పొలిటికల్ టచ్ ఇచ్చారు.
ఉడుతా భక్తిగా సేవ చేయడమే...
అభిమాని జాతీయ జెండా ఊపడాన్ని చూపిస్తూ.. నా అంతిమ లక్ష్యం జాతీయ జెండాకు గౌరవం కల్పించడమేనని పవన్ కల్యాణ్ అన్నారు. ఉడుతాభక్తిగా దేశానికి సేవ చేయడమే తన అంతిమ లక్ష్యమని, కాలమే నాకు శక్తి ఇస్తుందని ఆయన అన్నారు. నేను బలహీనుడ్ని అని అంటూ కాలం, భగవంతుడు తనకు శక్తి ఇస్తాడని అన్నారు. ఇది కూడా పవన్ కల్యాణ్ తన రాజకీయాలకు సంబంధించి చేసిందేనని భావిస్తున్నారు.