బిజెపిలో సంక్షోభం..యశ్వంత్సిన్హా రాజీనామా
న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ ఉపాధ్యక్షుడు, కర్ణాటక బిజెపి ఇన్ చార్జి యశ్వంత్సిన్హా పార్టీ పదవులకు చేసిన రాజీనామాను ఆ పార్టీ అగ్రనాయకత్వం ఆమోదించింది. గత కొంతకాలంగా సిన్హాపార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. పార్టీలో పదవుల మోజు పెరిగిపొయిందని ఆయన పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ కు రాసిన లేఖలో విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు నిర్వహించిన వారు ఓటమి బాధ్యతను కూడా తీసుకోవాలని యశ్వంత్ సూచించారు. ఆయన రాసిన లేఖలో ప్రముఖంగా ప్రస్ధావించిన అంశాలు పార్టీలో పదవుల కోసం ఎగబడుతున్నారు. నిజంగా మనది విభిన్న పార్టీ అయితే పదవీ త్యాగాలకు సిద్ధపడదాం. పార్టీ ఓటమికి అందరికీ బాధ్యత ఉందంటే.. అప్పుడు మనమంతా సమష్టిగా ఆ బాధ్యత పంచుకుందాం. అలాగే కొందరు నేతలు పార్టీలో జవాబుదారీతనం ఉండాలని కోరుకోవడం లేదు. తమ పదవులకు భంగం రాకూడదన్నదే వారి ఉద్దేశం. మే 31న జరిగిన పార్లమెంటరీ పార్టీ పదాధికారుల ఎన్నికలో పార్టీ నియమావళిని పూర్తిగా అటకెక్కించాం. కేరళలో ఇంతవరకు మనం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో తుడిచిపెట్టుకుపోయాం.
బెంగాల్, ఈశాన్య భారతాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాం. మంచి ఫలితాలు వస్తాయనుకున్న గుజరాత్, మధ్యప్రదేశ్లలో దెబ్బతిన్నాం. ఢిల్లీ, ఒరిస్సా, ఉత్తరాఖండ్, హర్యానా, జమ్మూకాశ్మీరుల్లో ఒక్క సీటైనా రాలేదు. రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో ఘోరపరాజయం ఎదురైంది. జార్ఖండ్, బీహారు, కర్ణాటకల్లో మాత్రమే సంతృప్తికరమైన ఫలితాలొచ్చాయి. కారణాలు విశ్లేషించాలి. మైనారిటీలు, మొదటిసారి ఓటేసినవారు, మహిళలు, ఎస్సీ ఎస్టీలు, పట్టణ మధ్యతరగతివారు, ప్రభుత్వోద్యోగులు, అందరినీ మించి రైతులు, పారిశ్రామిక కార్మికుల ఓటింగ్ సరళి ఎలా ఉంది? మనం ఎవరి ఓట్లు నష్టపోయాం? ఎక్కడ మనకు ఓట్లు ఎక్కువ వచ్చాయి? కాంగ్రెస్ బలం 145 నుంచి 206కి ఎలా ఎందుకు పెరిగింది.
ఇవన్నీ విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది. మన బలహీనతలను గ్రహించి.. ఓటమికి ఎవరు బాధ్యులో గుర్తించేందుకు మనం జంకుతున్నాం. కాలమే గాయాలను మాన్పుతుందని భావిస్తున్నాం. మన వైఫల్యాలను సమీక్షించుకోవడంలో విఫలమయ్యాం. అందుచేత సమగ్ర సమీక్ష అత్యావశ్యకం. ఇది పార్టీకి భావి పథాన్ని కచ్చితంగా నిర్దేశిస్తుందని, జవాబుదారీతనం తెస్తుందని నా నిశ్చితాభిప్రాయం. పార్టీ పదవుల నుంచి వైదొలగినా సామాన్య కార్యకర్తగా.. ఎంపీగా పార్టీకి సేవ చేస్తాను అన్నారు.