మద్దెలచెర్వు సూరి హత్య: ఏది సత్యం, ఏదసత్యం?
హత్య వెనక పరిటాల రవి అనుచరుల పాత్ర ఉందని, సూరిని హత్య చేసిన భాను కిరణ్ వెనక ఓ మంత్రి కుమారుడు ఉన్నాడని, భానుతో తలెత్తిన ఆస్తి తగాదాలే సూరి హత్యకు కారణమని, సూరికి తెలియకుండా భాను సెటిల్మెంట్లకు దిగడం వల్ల ఇరువురి మధ్య తగాదాలు వచ్చి సూరి హత్యకు గురయ్యాడని - ఇలా పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, సూరి ముఖ్య అనుచరుడు భాను కిరణ్ ఈ హత్యకు పాల్పడ్డాడనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. భానుపై ఫిర్యాదు చేసిన సూరి కారు డ్రైవర్ మధుసూదన్ రెడ్డిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరిటాల రవి అనుచరుల నుంచి ప్రాణ భయం ఉందని అనుమానించిన సూరి తన అనుచరుల చేతిలో హతం కావడం విచిత్రమే. అయితే, మద్దెలచెర్వు సూరి మెల్లగా రాజకీయాల్లో అడుగు పెట్టాలని అనుకుంటూ వస్తున్నాడు. పరిటాల రవి హత్య కేసులో అతను ప్రధాన నిందితుడు. ఈ కేసు నుంచి బయటపెడితే సూరి రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇదొక్క కేసు మాత్రమే క్లియర్ కావాల్సి ఉంది. ఈ కేసులో కూడా త్వరలోనే తీర్పు వెలువడనుందనే వార్తలు వచ్చాయి.
తనకు ప్రశాంతంగా బతకాలని ఉందని, తాను ఫాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్తానని సూరి పలు టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పారు. సూరి భార్య గంగుల భానుమతి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెసు టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ ఆమెకు అవకాశం దక్కలేదు. ఫాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని సూరి నిర్ణయించుకున్న మాట వాస్తవం. ఆయన రాజకీయాల్లోకి దిగితే సమీకరణాలు చాలా మారుతాయి.
సూరి మనసు మార్చుకున్న సమయంలో హత్యకు గురయ్యారు. ఇందులో రాజకీయాల ప్రమేయం ఏ మేరకు ఉందనేది చెప్పడం ఊహాగానమే అవుతుంది. బహుశా సూరి హత్య కేసుకు సంబంధించిన మిస్టరీ పరిటాల రవి హత్య కేసు మిస్టరీలాగా మారిపోతుందా అనేది చెప్పలేం.