చిక్కుల్లో సోనియా గాంధీ: కాంగ్రెసులో తెలంగాణ వర్సెస్ సీమాంధ్ర
తెలంగాణ ప్రజల్లో తాము తక్కువగా కాకుండా చూసుకోవడానికి, తాము కూడా తెలంగాణ కోసం పోరాడుతున్నామని చెప్పుకోవడానికి ముందుకు రాక తప్పలేదు. తాము అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షాలతో కలిసి తెలంగాణ కోసం లోకసభలో నినదించామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పడంలోని ఆంతర్యం అదే. కాగా, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ప్రధాని మన్మోహన్ సింగ్తో తెలంగాణ ఇవ్వకపోతే రాజీనామాలు చేయడానికి వెనకాడబోమని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ రంగంలోకి దిగి వారిని శాంతపరచాల్సి వచ్చింది.
తెలంగాణ ప్రాంత ఎంపీల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చూస్తే కాంగ్రెసు సీమాంధ్ర ఎంపీలు కూడా పట్టు వీడడం లేదు. తెలంగాణకు వ్యతిరేకంగా కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కరపత్రాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకోకూడదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మీడియా సమావేశం పెట్టి చెప్పారు. తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక రకంగా సురక్షితంగానే ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు సోనియా గాంధీ చిక్కుల్లో పడ్డారు.
తెలంగాణ అంశం కాంగ్రెసు తెలంగాణ, సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల మధ్య సమరంగా మారింది. అది శానససభలో కూడా ప్రతిబింబించే అవకాశం ఉంది. కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు కూడా తెరాస సభ్యులతో, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యులతో కలిసి అసెంబ్లీలో సమరం సాగించక తప్పని స్థితి. తెలంగాణపై అధికారికంగా ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా మొదట నిర్ణయం జరగాల్సింది సోనియా వద్దనే. సోనియా ఏ నిర్ణయం తీసుకుంటే దాన్నే ప్రభుత్వం అమలు చేస్తుంది. జి స్పెక్ట్రమ్ కుంభకోణం వివాదం ముగిసిందని భావిస్తుంటే ఇప్పుడు తెలంగాణ అంశం సమస్యగా మారింది.